Tirupati: ఎట్టకేలకు బోనుకు చిక్కిన చిరుత
ABN , Publish Date - Apr 07 , 2025 | 04:37 AM
తిరుపతిలో మూడు నెలలుగా హడలెత్తించిన చిరుతను ఎట్టకేలకు బోనులో పట్టుకున్నారు. వేద విశ్వవిద్యాలయం వద్ద ఏర్పాటు చేసిన బోనులో చిరుత పడింది

ఊపిరి పీల్చుకున్న తిరుపతివాసులు
తిరుపతి (విశ్వవిద్యాలయాలు), ఏప్రిల్ 6 (ఆంధ్రజ్యోతి): మూడు నెలలుగా తిరుపతి వాసులను హడలెత్తిస్తున్న చిరుతపులి ఎట్టకేలకు బోనులో పడింది. ఈమధ్యకాలంలో తిరుపతిలోని ఎస్వీయూ, వేద వర్సిటీ, వెటర్నరీ యూనివర్సిటీ పరిసరాల్లో తరచూ జింకలను, కుక్కలను చిరుత చంపి పడేసిన ఘటనలు చోటుచేసుకున్నాయి. చెర్లోపల్లె-అలిపిరి ప్రధాన మార్గంలో ఒక ద్విచక్రవాహనదారుడిపై చిరుత దాడి చేసి గాయపరిచింది. ఈ విషయాన్ని యూనివర్సిటీ అధికారులు ఫారెస్టు శాఖ దృష్టికి తీసుకెళ్లారు. వారు చిరుత కదలికలను గుర్తించడానికి ట్రాప్ కెమెరాలు, బోన్లు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం తెల్లవారుజామున శ్రీవేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం వద్ద ఏర్పాటు చేసిన బోనులో చిరుత పడింది.