ఆరోగ్య శ్రీ బిల్లుల చెల్లింపులో జాప్యమెందుకు?
ABN , Publish Date - Jan 09 , 2025 | 12:27 AM
ఆరోగ్యశ్రీ పథకం బిల్లుల చెల్లింపులో కూటమి ప్రభుత్వం జాప్యమెందుకు చేస్తోందని వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి మండిపడ్డారు.
వైద్యం అందక ఎవరైనా మరణిస్తే సీఎందే బాధ్యత
వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి
పత్తికొండ టౌన్, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): ఆరోగ్యశ్రీ పథకం బిల్లుల చెల్లింపులో కూటమి ప్రభుత్వం జాప్యమెందుకు చేస్తోందని వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి మండిపడ్డారు. బుధ వారం పత్తికొండకు వచ్చిన ఆయన స్థానిక ఎస్ఆర్ స్వగృహంలో మాజీ కేడీసీసీ బ్యాంకు మాజీ వైస్ చైర్మన్ రామచంద్రారెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఆరోగ్యశ్రీ పథకానికి రూ.3వేల కోట్ల బకాయిలు చెల్లించాలన్నారు. నిధులు చెల్లించకుండా కూటమి ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడడం సరికాదని అన్నారు. బకాయిలు చెల్లించకపోవడంతో కార్పొరేట్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ సర్వీసులను నిలిపివేయాని గుర్తు చేశారు. ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందక ఎవరైనా మరణిస్తే అందుకు కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఆ తరువాత సీఎం చంద్ర బాబుపై హత్యా నేరం కింద కేసులు నమోదు చేసేలా న్యాయస్థానం ద్వారా పోరాటం చేస్తామన్నారు. కూటమి రూ.75వేల కోట్లు అప్పులు తెచ్చినా సూపర్ సిక్స్, ఫీజు రీయింబర్స్మెంటు పథకాలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో విద్యుత్చార్జీలు పెంచడం ద్వారా రాష్ట్ర ప్రజానీకంపై రూ.15 వేల కోట్లు అదనపు భారం పడిందన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పాలన గాడి తప్పిందన్నారు. గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో సంక్షేమ క్యాలెండర్ విడుదల సంక్షేమ పథకాలు అందించించామని చెప్పారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తామన్నారు. సమావేశంలో వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి శ్రీరంగడు, నాయకులు ఎర్రగుడి రామచంద్రారెడ్డి, రామకొండ సుధాకర్ రెడ్డి, గోపాల్ రెడ్డి, భరత్రెడ్డి, నాగభూషణం రెడ్డి మాజీ సర్పంచ్ జయచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.