జిల్లా అభివృద్ధిలో భాగస్వాములు కావాలి
ABN , Publish Date - Feb 08 , 2025 | 12:19 AM
రుణాలు విరివిగా మంజూరు చేసి జిల్లా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కలెక్టర్ రాజకుమారి బ్యాంకు మేనేజర్లకు సూచించారు.

బ్యాంకు మేనేజర్లతో కలెక్టర్
నంద్యాల కల్చరల్, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): రుణాలు విరివిగా మంజూరు చేసి జిల్లా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కలెక్టర్ రాజకుమారి బ్యాంకు మేనేజర్లకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో బ్యాంకు మేనేజర్ల జిల్లా ఓరియంటేషన్ వర్క్షాపులో కలెక్టర్ ముఖ్య అతిఽథిగా హాజరై మాట్లాడారు. వ్యవసాయం, అనుబంధ రంగాలు, పర్యాటక రంగం, బలహీనవర్గాల కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పన తదితర ప్రాఽథమిక రంగాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చి రుణాలు ఇవ్వాలన్నారు. సంగమేశ్వరం, కృష్ణానది పరివాహక ప్రాంతంలో సాగు నీటి కాలువల కింద 5.97 లక్షల ఎకరాల్లో రైతులు పంటలు వేసుకుంటున్నారని, రైతులకు అవసరమైన సమయంలో రుణాలు ఇవ్వాలని సూచించారు. అరటి రైతులకు, తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు ఇచ్చే పంటలకు, స్థిరమైన వ్యవసాయ ఉత్పత్తుల కోసం, చేప పిల్లల పెంపకం కోసం, పాడి రైతులకు అధిక పాలు ఇచ్చే గేదెల కొనుగోలు కోసం రుణాలు ఇచ్చి సహకరించాలన్నారు. చెంచుగూడెంలో గిరిజనులకు పీఎం జన్మన్ కింద గృహాలు నిర్మించి ఇచ్చేందుకు వచ్చే ఏజన్సీల వారికి బ్యాంకర్లు సహకరించాలన్నారు. జేసీ విష్ణుచరణ్ మాట్లాడుతూ బ్యాంకర్లు, జిల్లా అధికారుల సమన్యయంతో కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేయాలని సూచించారు.