Share News

కర్నూలు ఎస్పీగా విక్రాంత్‌ పాటిల్‌

ABN , Publish Date - Jan 20 , 2025 | 11:58 PM

కర్నూలు ఎస్పీగా విక్రాంత్‌ పాటిల్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

కర్నూలు ఎస్పీగా విక్రాంత్‌ పాటిల్‌
విక్రాంత్‌ పాటిల్‌

ఆరు నెలలకే ఎస్పీ బిందుమాధవ్‌ బదిలీ

కర్నూలు క్రైం, జనవరి 20 (ఆంధ్రజ్యోతి) : కర్నూలు ఎస్పీగా విక్రాంత్‌ పాటిల్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఐపీఎస్‌ల బదిలీల్లో భాగంగా కర్నూలు ఎస్పీ జి.బిందుమాధవ్‌ను కాకినాడ జిల్లా ఎస్పీగా బదిలీ చేసింది. అక్కడ ఎస్పీగా ఉన్న విక్రాంత్‌ పాటిల్‌ను కర్నూలుకు బదిలీ చేసింది. ఎస్పీగా ఉన్న బిందుమాధవ్‌ గతేడాది జూలై 16న కర్నూలు ఎస్పీగా నియమితులయ్యారు. ఆరు నెలల నాలుగు రోజులకే ఆయనను బదిలీ చేయడం గమనార్హం.

కొత్త ఎస్పీ గురించి

2012 బ్యాచ్‌కు చెందిన విక్రాంత్‌ పాటిల్‌ తమిళనాడు క్యాడర్‌ ఐపీఎస్‌ అధికారి. ఏపీలో విజయనగరం అడిషినల్‌ ఎస్పీ (ఆపరేషన్స్‌)గా పని చేశారు. చిత్తూరు, రైల్వే ఎస్పీగా, ఆ తర్వాత విజయవాడ డీసీపీగా, విజయనగరం 5వ బెటాలియన్‌ కమాండెంట్‌గా, పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీగా, కాకినాడ ఎస్పీగా పని చేశారు.

ఏపీఎస్పీ బెటాలియన్‌ కమాండెంట్‌గా ఎం.దీపిక

కర్నూలు ఏపీఎస్పీ రెండో బెటాలియన్‌ కమాండెంట్‌గా ఎం.దీపికను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈమె ప్రస్తుతం కాకినాడ మూడో బెటాలియన్‌ కమాండెంట్‌గా పని చేస్తున్నారు. ఈమె గతంలో కర్నూలు అడిషినల్‌ ఎస్పీగా పని చేశారు.

కొత్త ఎస్పీ, కమాండెంట్లు ఇరువురు భార్యాభర్తలు

కర్నూలు ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌, బెటాలియన్‌ కమాండెంట్‌ దీపికలు ఇద్దరూ భార్యాభర్తలు. వీరిద్దరు ఎక్కడ పని చేసినా కూడా ఒకే జిల్లాలో పని చేస్తూ వచ్చారు.

Updated Date - Jan 20 , 2025 | 11:58 PM