సాంకేతికతను ఉపయోగించండి
ABN , Publish Date - Feb 13 , 2025 | 12:01 AM
మారుతున్న చట్టాలకనుగుణంగా పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు సాంకేతికతను వినియోగించాలని ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా సూచించారు.

నేర సమీక్షా సమావేశంలో ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా సూచన
నంద్యాల క్రైం, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): మారుతున్న చట్టాలకనుగుణంగా పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు సాంకేతికతను వినియోగించాలని ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా సూచించారు. బుధవారం నంద్యాలలోని జిల్లా పోలీసు కార్యాలయం సమావేశ భవనంలో నంద్యాల పోలీసు సబ్ డివిజన్కు సంబంధించిన నేర సమీక్షా సమావేశం జరిగింది. పోలీసు స్టేషన్ల వారీగా పెండింగ్ కేసులు, వాటి స్థితిగతులు, నమోదైన కేసుల్లో నిందితుల అరెస్ట్, దర్యాప్తు వివరాలు, పురోగతిపై పోలీసు అధికారులతో ఆరాతీసి కేసుల ఫైల్స్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ బాధితులకు న్యాయం జరిగేవిధంగా వ్యవహరించాలన్నారు. యుఐ కేసుల దర్యాప్తు వేగవంతం చేసి నిర్ణీత సమయంలో చార్జిషీట్ దాఖలు చేసి కేసులను తగ్గించాలని సూచించారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై సత్వరమే స్పందించాలని, తప్పిపోయిన బాల, బాలికల కేసుల్లో ఆధునిక సాంకేతికతను వినియోగించాలని, పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లలో విద్యార్థులకు సమాజంలో జరిగే నేరాలపై అవగాహన కల్పించాలన్నారు పోక్సో కేసుల్లో నిందితులపై నిఘా ఉంచాలని అవసరమైతే రౌడీషీట్ ఓపెన్ చేయాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు వివరించారు. ఎన్ఫోర్స్మెంట్పై ప్రత్యేకదృష్టి పెట్టి ప్రతిరోజు విజిబుల్ పోలీసింగ్లో భాగంగా తనిఖీలు నిర్వహించి గంజాయి, మద్యం, పీడీఎస్రైస్ అక్రమ రవాణా జరగకుండా నిరోధించాలని, బహిరంగ మద్యపానం, డ్రంకెన్డ్రైవ్, మైనర్ డ్రైవింగ్లపై చర్యలు తీసుకోవాలని, నెంబర్ప్లేట్లులేని వాహనాలపై నిఘా ఉంచి తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీతోపాటు ఎస్డీపీవో జావలి ఆల్ఫోన్స్, అడిషనల్ ఎస్పీ (అడ్మిన్)యుగంధర్బాబు పాల్గొన్నారు.