క్రీడారంగం అభివృద్ధే ధ్యేయం
ABN , Publish Date - Feb 01 , 2025 | 12:34 AM
రాష్ట్రంలో క్రీడారంగాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని శాప్(ఏపీ స్పోర్ట్స్ అథారిటీ) చైర్మన్ అనిమిని రవి నాయుడు అన్నారు.
శాప్ చైర్మన్ రవి నాయుడు
అభివృద్ధి, సంక్షేమాల్లో ముందుకు పోతున్న ప్రభుత్వం
ఎమ్మెల్యే అఖిలప్రియ
ఆళ్లగడ్డ(శిరివెళ్ల), జనవరి 31(ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో క్రీడారంగాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని శాప్(ఏపీ స్పోర్ట్స్ అథారిటీ) చైర్మన్ అనిమిని రవి నాయుడు అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతిభ కలిగిన క్రీడాకారులు గ్రామీణ స్థాయి నుంచి జాతీయ స్థాయికి వెళ్లేలా తీర్చిదిద్దుతామని అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలోని ఇండోర్ స్టేడియాన్ని, భూమా బాలిరెడ్డి ఇండోర్ స్టేడియాన్ని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియతో కలిసి ఆయన పరిశీలించారు. 2018లో మంత్రి హోదాలో భూమా అఖిలప్రియ రూ.2 కోట్లతో ఆళ్లగడ్డలో క్రీడా వికాస కేంద్రం నిర్మాణ పనులు చేపట్టగా.. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆ పనులను నిలిపివేసిందన్నారు. ఇప్పుడు ఆ స్టేడియం పనులు పూర్తిచేస్తామని అన్నారు. రాష్ట్రంలో వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెట్టిన మాజీ సీఎం జగన్ ఇంటి ముందు విద్యార్థులు ఆందోళన చేయాలి అన్నారు. అనంతరం ఎమ్మెల్యే అఖిలప్రియ మాట్లాడుతూ అన్నపూర్ణగా ఉన్న ఆంధ్రప్రదేశ్ను గత వైసీపీ ప్రభుత్వం అప్పుల రాష్ట్రంగా మార్చిందని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నెలల వ్యవధిలోనే సంక్షేమం, అభివృద్ది ద్వారా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తోందన్నారు. ఆళ్లగడ్డలో అవినీతి జరుగుతోందని వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలపై వారి ఇళ్ల వద్దనే చర్చకు సిద్ధమని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు నాయబ్ రసూల్, హుసేన్ బాషా, శ్రీవిద్య, జనసేన నియోజకవర్గ సమన్వయకర్త మైలేరి మల్లయ్య పాల్గొన్నారు.