మత్స్యకారులకు సహకారం
ABN , Publish Date - Feb 15 , 2025 | 11:08 PM
మత్స్యకారులకు అన్ని విధాలుగా సహకరించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని జిల్లా మత్స్యకార సహకార సంఘం చైర్మన్ నవీన్ కుమార్ వెల్లడించారు.

వారి ప్రయోజనాలే ధ్యేయంగా పని చేస్తున్నాం
ఉమ్మడి జిల్లా మత్స్య సహకార సంఘం చైర్మన్ నవీన్ కుమార్
కర్నూలు అగ్రికల్చర్, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): మత్స్యకారులకు అన్ని విధాలుగా సహకరించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని జిల్లా మత్స్యకార సహకార సంఘం చైర్మన్ నవీన్ కుమార్ వెల్లడించారు. ఇప్పటికే మత్స్యకారులకు ఎంతో ప్రయోజనం చేకూర్చే నిర్ణయాలను తమ ప్రభుత్వం అమలు చేసేందుకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. శనివారం మేనేజింగ్ డైరెక్టర్ సంధ్యారాణి సమక్షంలో జిల్లా మత్స్య సహకార సంఘం కార్యవర్గ సమావేశం నిర్వహించారు. మత్స్యకారులందరూ ఎన్ఎఫ్డీపీ, ఈశ్రమ్ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని చైర్మన్ కోరారు. కొత్త సొసైటీలను ఏర్పాటు, ఇప్పటికే కొనసాగుతున్న సంఘాల్లో అర్హులను సభ్యులుగా చేర్చుకోవడానికి సహకార సంఘాల అధ్యక్షులు సహకరించాలని మేనేజింగ్డైరెక్టర్ సంధ్యారాణి విజ్ఞప్తి చేశారు. అనంతరం మత్స్యకారుల సంక్షేమానికి అవసరమైన కీలక అంశాలపై పలు తీర్మానాలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైస్ చైర్మన్ పెద్దవీరేష్, డైరెక్టర్లు శేఖర్, భాస్కర్, నాగశేషులు, వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు, మల్లీశ్వరుడు, మద్దిలేటి, నగేష్ పాల్గొన్నారు.