Share News

రెగు ఛాంపియన్‌ మణిపూర్‌

ABN , Publish Date - Feb 01 , 2025 | 12:33 AM

నంద్యాలలో జరుగుతున్న 28వ జాతీయ జూనియర్‌ సెపక్‌తక్రా ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో రెగు విభాగంలో మణిపూర్‌ బాల, బాలికల జట్లు ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నాయి.

రెగు ఛాంపియన్‌ మణిపూర్‌
బాలుర విభాగంలో ప్రథమ, ద్వితీయ విజేతలు మణిపూర్‌, నాగాలాండ్‌ జట్లు

ద్వితీయ స్థానంలో నాగాలాండ్‌, కేరళ జట్లు

నంద్యాల వైద్యం, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): నంద్యాలలో జరుగుతున్న 28వ జాతీయ జూనియర్‌ సెపక్‌తక్రా ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో రెగు విభాగంలో మణిపూర్‌ బాల, బాలికల జట్లు ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. బాలుర తుది పోరులో మణిపూర్‌ జట్టు నాగాలాండ్‌ జట్టుపై 2-0పాయింట్ల ఆధిక్యంతో విజయం సాధించింది. నాగాలాండ్‌ జట్టు ద్వితీయ స్థానంలో నిలిచింది. బాలికల విభాగంలో మణిపూర్‌ జట్టు కేరళ జట్టుపై 2-0 పాయింట్ల తేడాతో గెలిచి చాంపియన్‌షిప్‌ కైవసం చేసుకుంది. కేరళ జట్టు ద్వితీయ స్థానం దక్కించుకుంది. అంతకు ముందు రెగు బాలుర క్వార్టర్‌ ఫైనల్‌ పోటీల్లో మణిపూర్‌ జట్టు మహారాష్ట్ర జట్టుపై 2-0, బీహార్‌ జట్టు తమిళనాడు జట్టుపై 2-0, ఢిల్లీ జట్టు ఉత్తరప్రదేశ్‌ జట్టుపై 2-1, నాగాలాండ్‌ జట్టు ఒరిస్సా జట్టుపై 2-0 ఆధిక్యంతో గెలుపొంది సెమీ ఫైనల్‌కు చేరుకున్నాయి. సెమీ ఫైనల్‌ పోటీల్లో మణిపూర్‌ జట్టు ఢిల్లీ జట్టుపై 2-0, నాగాలాండ్‌ జట్టు బీహార్‌ జట్టుపై 2-0పాయింట్ల ఆధిక్యంతో గెలుపొంది ఫైనల్‌కు చేరాయి. బాలికల రెగు పోటీల్లో క్వార్టర్‌ ఫైనల్స్‌లో హర్యానా జట్టు రాజస్థాన్‌ జట్టుపై 2-0, ఆంధ్రప్రదేశ్‌ జట్టు ఢిల్లీ జట్టుపై 2-0, మణిపూర్‌ జట్టు బీహార్‌ జట్టుపై 2-0, కేరళ జట్టు ఒరిస్సా జట్టుపై 2-1 ఆధిక్యంతో గెలిచి సెమీ ఫైనల్‌కు చేరాయి. సెమీ ఫైనల్‌ పోటీల్లో మణిపూర్‌ జట్టు హర్యానా జట్టుపై 2-0, కేరళ జట్టు ఆంధ్రప్రదేశ్‌ జట్టుపై 2-0పాయింట్ల ఆధిక్యంతో ఫైనల్‌కు చేరుకున్నట్లు రాష్ట్ర సెపక్‌తక్రా సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు తెలిపారు.

జాతీయ చాంపియన్‌ షిప్‌లో ఆంధ్రజ్యోతి రెపరెపలు

నంద్యాలలో జరుగుతున్న జాతీయ సెపక్‌తక్రా ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో శుక్రవారం ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన కథనాన్ని క్రీడాకారులు ఆసక్తిగా చదివారు. పత్రికలో వచ్చిన కథనానికి క్రీడాకారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ జాతీయ స్థాయి పోటీలు నంద్యాలలోని రామకృష్ణ పీజీ క ళాశాల మైదానంలో జరుగుతున్నాయి. మరో రెండు రోజులపాటు ఈ పోటీలు జరగనున్నట్లు నిర్వాహక కార్యదర్శి నిమ్మకాయల సుధాకర్‌ తెలిపారు.

Updated Date - Feb 01 , 2025 | 12:33 AM