Share News

బాల్య వివాహాలను అరికట్టాలి

ABN , Publish Date - Feb 01 , 2025 | 12:27 AM

అన్ని శాఖలు బాల్య వివాహాలు అరికట్టడానికి సమన్వయంతో పని చేయాలని మహిళ, శిశు వికలాంగ వయోవృద్ధుల సంక్షేమ శాఖ సెక్రటరీ ఏ. సూర్యకుమారి పేర్కొన్నారు.

బాల్య వివాహాలను అరికట్టాలి
పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న సూర్యకుమారి, కలెక్టర్‌ తదితరులు

మహిళా శిశు, వికలాంగ వయోవృద్ధుల

సంక్షేమ శాఖ కార్యదర్శి సూర్యకుమారి

కర్నూలు కలెక్టరేట్‌, జనవరి 31: (ఆంధ్రజ్యోతి): అన్ని శాఖలు బాల్య వివాహాలు అరికట్టడానికి సమన్వయంతో పని చేయాలని మహిళ, శిశు వికలాంగ వయోవృద్ధుల సంక్షేమ శాఖ సెక్రటరీ ఏ. సూర్యకుమారి పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు, తహసీల్దార్లు, మండల విద్యాశాఖ అధికారులు, వైద్య ఆరోగ్యశాఖ, పోలీసు శాఖల అధికారులతో బాల్య వివాహాల నిర్మూలనపై మహిళా శిశు వికలాంగ వయోవృద్ధుల సంక్షేమ శాఖ సెక్రటరీ ఏ. సూర్యకుమారి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో గత ఆరు నెలలుగా 746 బాల్య వివాహాలను నివారించామని అన్నారు. కలెక్టర్‌ పి. రంజిత్‌ బాషా మాట్లాడుతూ జిల్లాలో బాల్య వివాహాలను అరికట్టేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ ఏడాది 64 బాల్య వివాహాలను అడ్డుకున్నామని అన్నారు. కర్ణాటక రాష్ట్ర సరిహద్దులో ఉన్న 5 మండలాలైన ఆదోని, ఎమ్మిగనూరు, గోనెగండ్ల, మంత్రాల యం, సి. బెళగల్‌ మండలాలను హైరిస్క్‌ మండలాలుగా గుర్తించా మన్నారు. బాల్య వివాహాలను నిర్మూలించేందుకు 682 గ్రామక మిటీలను ఏర్పాటు చేశామన్నారు. ఈ సమావేశంలో ఆదోని సబ్‌ కలెక్టర్‌ మౌర్య భరద్వాజ్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ చల్లా కళ్యాణి, అడిషనల్‌ ఎస్పీ హుశేన్‌పీరా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆర్జేడీ రోహిణి, యూనిసెఫ్‌ డైరెక్టర్‌ మురళీకృష్ణ, ఐసీడీఎస్‌ పీడీ నిర్మల, జడ్పీ సీఈవో నాసరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 01 , 2025 | 12:27 AM