పనితీరు ఆధారంగానే పదవులు : ఎమ్మెల్యే
ABN , Publish Date - Apr 18 , 2025 | 12:52 AM
పనితీరు ఆధారంగానే పదవులు వస్తాయని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి అన్నారు.
ఆత్మకూరు, ఏప్రిల్ 17(ఆంధ్రజ్యోతి): పనితీరు ఆధారంగానే పదవులు వస్తాయని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి అన్నారు. పట్టణంలోని శ్రీవెంకటేశ్వర స్వామి కల్యాణ మంటపంలో గురువారం టీడీపీ శ్రీశైలం నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ టీడీపీ ఆవిర్భావం నుంచి కార్యకర్తలు అండగా ఉంటూ వస్తున్నారని అన్నారు. గ్రామ స్థాయి నుంచే కమిటీలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. గతంలో వివిధ కమిటీల్లో బాధ్యతగా పనిచేసిన వ్యక్తులను యథావిధిగా కొనసాగిస్తామని, పనితీరు సరిగ్గా లేనివారిని తొలగిస్తామని చెప్పారు. శ్రీశైలం నుంచి మహానంది వరకు టెంపుల్ టూరిజం కారిడార్ కింద యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తానన్నారు. అర్హులందరికీ పథకాలు అందజేస్తామన్నారు. రబీ సీజన్లో ప్రణాళికబద్ధంగా వ్యవహరించి తెలుగుగంగ, కేసీ కెనాల్, సిద్ధాపురం ఎత్తిపోతల ఆయకట్టు రైతులకు సాగునీరు అందించామని గుర్తుచేశారు. ఐదేళ్లు అధికారాన్ని అడ్డుపెట్టుకుని అవినీతి, అక్రమాలకు పాల్పడిన మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి జైలుకు వెళ్లక తప్పదని అన్నారు. టీడీపీ నియోజకవర్గ పరిశీలకుడు సుబ్బారావు, కేసీ కెనాల్ ప్రాజెక్ట్ కమిటీ అధ్యక్షుడు రామలింగారెడ్డి, మాజీ సర్పంచ్ గోవిందరెడ్డి, టీడీపీ వివిధ మండలాల అధ్యక్షులు శివప్రసాద్రెడ్డి, శేషిరెడ్డి, నరసింహారెడ్డి, మధు, ఆత్మకూరు పట్టణాధ్యక్షుడు వేణుగోపాల్, ప్రధాన కార్యదర్శి అబ్దుల్లాపురం బాషా, నాయకులు రాజారెడ్డి, షాబుద్దీన్, పస్పీల్ మున్నా తదితరులు ఉన్నారు.