గీత కార్మికులకు మద్యం షాపులు
ABN , Publish Date - Feb 10 , 2025 | 11:50 PM
గీత కార్మికులకు మద్యం షాపులు

లాటరీ ద్వారా 11 మంది ఎంపిక
నంద్యాల క్రైం, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం గీత కార్మికులకు కేటాయించిన 11 మద్యం షాపులకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను లాటరీ విధానంలో చేపట్టారు. సోమవారం ఐదు మున్సిపాల్టీలైన నంద్యాల, నందికొట్కూరు, ఆళ్లగడ్డ, డోన్, ఆత్మకూరులతోపాటు ఆరు మండలాలైన జూపాడుబంగ్లా, పగిడ్యాల, డోన్ రూరల్, ఉయ్యాలవాడ, కొత్తపల్లి, పాములపాడులకు సంబంధించి నంద్యాల కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో లాటరీ ప్రక్రియ చేపట్టారు. డీఆర్వో పర్యవేక్షణలో నంద్యాల జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి రవికుమార్ సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. 11 మద్యం షాపులకు గాను 11 మందిని ఎంపిక చేశారు. మరో ఇద్దరు రిజర్వ్డు ఆర్1, ఆర్2 అభ్యర్థులను ఒక్కొక్క షాపునకు ఎంపిక చేశారు. విజయవంతమైన అప్లికెంట్స్కు ప్రొవిజనల్ లైసెన్స్ను అక్కడే జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి రవికుమార్ అందజేశారు. లాటరీ కార్యక్రమానికి ప్రత్యేక పరిశీలకులుగా కర్నూలుకు చెందిన ఏసీ, ఎన్ఫోర్స్మెంట్ హనుమంతరావు హాజరయ్యారు.