బాల్య వివాహాలను నిర్మూలిద్దాం
ABN , Publish Date - Jan 30 , 2025 | 11:38 PM
ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో బాల్యవివాహాలను నిర్మూలించేందుకు కృషి చేయాలని స్త్రీ,శిశు సంక్షేమశాఖ సంచాలకులు వేణుగోపాల్రెడ్డి సూచించారు.

స్త్రీ శిశు సంక్షేమ శాఖ సంచాలకుడు వేణుగోపాల్ రెడ్డి
నంద్యాల కల్చరల్, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో బాల్యవివాహాలను నిర్మూలించేందుకు కృషి చేయాలని స్త్రీ,శిశు సంక్షేమశాఖ సంచాలకులు వేణుగోపాల్రెడ్డి సూచించారు. గురువారం నంద్యాల ఎన్జీఓస్ కాలనీలోని కోఆపరేటివ్ ఫంక్షన్ హాలులో బాల్యవివాహాల నియంత్రణ, కిశోర వికాసం, మిషన్ వాత్సల్య తదితర కార్యక్రమాలపై అన్ని శాఖల అధికారులతో వర్క్షాప్ నిర్వహించారు. ఈ కార్యక్ర మానికి కలెక్టర్ రాజకుమారి, యూనిసెఫ్ బాలల రక్షణ అభివృద్ధి అధికారి మురళీకృష్ణ, ఆర్డీఓలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో బాల్య వివాహాలు, టీనేజ్ ప్రెగ్నెన్సీ అధికంగా ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి అన్ని జిల్లాల్లో వర్క్ షాప్లు నిర్వహించి బాల్యవివాహాలను అరికట్టేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ జిల్లాలోని 1,663 అంగన్వాడీ కేందాల్లో 33 శాతం పిల్లలు వయసుకు తగ్గ బరువు, ఎత్తు లేకుండా ఉన్నారన్నారు. జిల్లాలో బాల్యవివాహాల నియంత్రణకు గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కమిటీలు ఏర్పాటు చేసి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఐసీడీఎస్ పీడీ లీలావతి, ఆర్డీఓలు చల్లా విశ్వనాథ్, నరసింహులు, నాగజ్యోతి, జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ సుబ్బారెడ్డి, డీఆర్డీఏ పీడీ శ్రీధర్రెడ్డి, డీఈఓ జనార్దన్ రెడ్డి, డీఎంహెచ్ఓ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.