ల్యాబ్ టెక్నీషియన్లు సమయపాలన పాటించాలి
ABN , Publish Date - Jun 05 , 2025 | 12:46 AM
జిల్లాలోని ఆస్పత్రుల్లో పనిచేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్లు సమయపాలన పాటించి విధులకు హాజరై పరీక్షలన్నీ నిర్వహించాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డా.వెంకటరమణ ఆదేశించారు.
నంద్యాల హాస్పిటల్, జూన్ 4 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ఆస్పత్రుల్లో పనిచేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్లు సమయపాలన పాటించి విధులకు హాజరై పరీక్షలన్నీ నిర్వహించాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డా.వెంకటరమణ ఆదేశించారు. పట్టణంలోని జీజీహెచ్లోని ఎంసీహెచ్ బ్లాక్లో బుధవారం జరిగిన జిల్లా ల్యాబ్ టెక్నీషియన్ల నెలవారి సమీక్షాసమావేశంలో ఆయన మాట్లాడారు. మలేరియా ఎలిమి నేషన్ స్టేజిలో ఉన్నామని, నిర్దేశించిన లక్ష్యాలను ప్రతినెలా పూర్తి చేయాలని ఆదేశించారు. ల్యాబ్కు అవసరమైన అన్ని రసాయనాలు, పరికరాలు అందుబాటులో ఉంచుకోవాలని, అవసరమైన వాటికోసం తన దృష్టికి తీసుకురావాలని సూచిం చారు. జిల్లా మలేరియా అధికారి కామేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈ నెల నుంచి ప్రతిరోజు నిర్వహించే రక్తపరీక్షలన్నీ ఐహెచ్ఐపీవీబీడీ పోర్టల్లో నమోదు చేయాలన్నారు. నెలవారి సమర్పించాల్సిన నివేదికలను, ల్యాబ్ రికార్డులను సక్రమంగా నిర్వహించాలన్నారు. మలేరియా వ్యతిరేక మాసోత్సవం సందర్భంగా ప్రజల్లో అవగాహన కల్పించాలని కోరారు. సమావేశంలో అదనపు జిల్లా వైద్యాధికారి శారదాబాయి, సహాయ మలేరియా అధికారి రామవిజయరెడ్డి పాల్గొన్నారు.