అభివృద్ధిని జీర్ణించుకోలేని జగన్
ABN , Publish Date - Feb 10 , 2025 | 11:58 PM
కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి ధ్వజమెత్తారు

జిల్లా అభివృద్ధి కోసం సీఎంను కలుస్తాం
టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి
కర్నూలు అర్బన్, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ రైతు లు, విద్యార్థులను రెచ్చగొట్టి ఆందోళనలు చేసేందు కు కుట్రలు చేస్తున్నారని, ప్రజలు ఎవ్వరూ ఆయన మాటలు పట్టించుకునేందుకు సిద్ధంగా లేరని అన్నారు. రాష్ట్రాన్ని ఆర్ధికంగా దివాలా తీయించి, అన్ని వనరులను సర్వనాశనం చేసిన తీరు ప్రజల కు ఇంకా గుర్తుందని అన్నారు. వ్యవస్థలన్నిటినీ గాడిలో పెట్టేందుకు చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వ సహకారంతో కృషి చేస్తున్నారని అన్నారు. జిల్లాను అన్ని విధాలుగా ఆభివృద్ధి చేసేందుకు ఎన్నో కార్యక్రమాలను చేపట్టారని, పత్తికొండ, ఆలూరు, మంత్రాలయం, ఎమ్మిగనూరు వంటి ప్రాంతాల అభివృద్ధికి సోలార్ విద్యుత్, పత్తికొండలో జ్యూస్ ఫ్యాక్టరీ, ఆర్డీఎస్ రైట్ కెనాల్, వేదవతి వంటి వాటి కోసం ప్రత్యేక శ్రద్ధ్ద చూపుతున్నారని గుర్తు చేశారు. గుండ్రేవుల ప్రాజెక్టు కోసం సీఎం చంద్రబాబుకు విన్నవించుకునేందుకు ఉమ్మడి జిల్లా నాయకులు ముందుకు రావాలని, ఈ ప్రాజెక్టు నిర్మాణం జరిగితే కర్నూలుతో పాటు ఇతర ప్రాంతాలకు సాగు, తాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కారం అవుతుందని అన్నారు. జిల్లాలో పరిశ్రమల స్థాపన కోసం మంత్రి టీజీ భరత్ ఎంతో కృషి చేస్తున్నారని, జిల్లాకు హైకోర్టు బెంచ్ ఏర్పాటు ప్రక్రియ వేగవంతం కావడానికి కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి బత్తిన వెంకట రాముడు, ఆదోని నాయకులు ఉమాపతి నాయుడు, బతే క్రిష్ణుడు, జె. పుల్లయ్య పాల్గొన్నారు.