Share News

మార్చి లోపు గృహ నిర్మాణాలు పూర్తి చేసుకోవాలి

ABN , Publish Date - Dec 04 , 2025 | 12:56 AM

ఎన్టీఆర్‌ హౌసింగ్‌ స్కీం ద్వారా గృహాలను పొందిన లబ్ధిదారులు ఈ ఏడాది మార్చిలోపు గృహ నిర్మాణాలను పూర్తి చేసుకోవాలని జిల్లా హౌసింగ్‌ పీడీ చిరంజీవి సూచించారు.

మార్చి లోపు గృహ నిర్మాణాలు పూర్తి చేసుకోవాలి
గోనెగండ్లలో లబ్ధిదారులతో మాట్లాడుతున్న పీడీ చిరంజీవి

గోనెగండ్ల, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్‌ హౌసింగ్‌ స్కీం ద్వారా గృహాలను పొందిన లబ్ధిదారులు ఈ ఏడాది మార్చిలోపు గృహ నిర్మాణాలను పూర్తి చేసుకోవాలని జిల్లా హౌసింగ్‌ పీడీ చిరంజీవి సూచించారు. గోనెగండ్లలోని కేజీబీవీ కాలనీలో నిర్మాణ దశలో ఉన్న గృహాలను బుధవారం పీడీ చిరంజీవి, తహసీల్దార్‌ రాజేశ్వరి, ఎంపీడీవో మణిమంజరి, హౌసింగ్‌ డీఈ ప్రసాద్‌ పరిశీలించారు. ఏఈ షేక్షావలిని అడిగి సమాచారం తెలుసుకున్నారు. అనంతరం సచివాలయంలో మండలంలోని ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌, పంచాయతీ కార్యదర్శులు, హౌసింగ్‌ లబ్ధిదారులతో సమావేశం నిర్వహించారు. పీడీ మాట్లాడుతూ మండలానికి పఎంఏవై 1.0 కింద 658 గృహాలకు గానూ 482 బేసిమెంట్‌ లెవల్‌లో ఉన్నాయని ఆయన తెలిపారు. ఎస్సీ, బీసీ లబ్ధిదారులకు ప్రభుత్వం రూ. 1.85 లక్షలతో పాటు అదనంగా రూ.50 వేలు అందజేస్తుందని తెలిపారు. పూర్తి అయిన గృహాలకు విద్యుత్‌ సౌకర్యం కూడా వెంటనే ఇస్తున్నట్లు వారు తెలిపారు. హౌసింగ్‌ ఏఈ షేక్షావలి, గ్రామ సర్పంచ్‌ హైమావతి, ఏపీఎం మహుమ్మద్‌ బాషా, పలుగ్రామాల పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

Updated Date - Dec 04 , 2025 | 12:56 AM