‘భూమి ఆరోగ్యంగా ఉంటేనే మంచి దిగుబడులు’
ABN , Publish Date - Jun 03 , 2025 | 11:59 PM
భూమి ఆరోగ్యంగా ఉంటేనే మేలైన దిగుబడులు సాధించవచ్చని జిల్లా వ్యవసాయాధికారి మురళీకృష్ణ అన్నారు.
నంద్యాల రూరల్ , జూన్ 3 (ఆంధ్రజ్యోతి): భూమి ఆరోగ్యంగా ఉంటేనే మేలైన దిగుబడులు సాధించవచ్చని జిల్లా వ్యవసాయాధికారి మురళీకృష్ణ అన్నారు. అయ్యలూరు, పెద్దకొట్టాల గ్రామాలలో మంగళవారం బనగానపల్లె మండలం యాగంటిపల్లె కేవీకే కోఆర్డినేటర్ ధనలక్ష్మి ఆధ్వర్యంలో వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. డీఏవో మాట్లాడుతూ ఈ ఏడాది వర్షాలు ముందుగానే కురుస్తుండడంతో వరి సాగుకు ముందు పచ్చిరొట్ట ఎరువులైన జీలుగ, పెసర, మినుమును సాగు చేసుకోవాలని సూచించారు. వీటిని భూమిలో కలియదున్నడం వల్ల కర్బన శాతం పెరిగి నేల సారవవతం అవుతుందన్నారు. పొలం గట్లపై కంది, కూరగాయలు సాగు చేసుకోవడం వల్ల అదనపు ఆదాయం చేకూరుతుందన్నారు. రసాయన ఎరువుల వాడకం తగ్గించి ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పాటిస్తే నాణ్యమైన దిగుబడులు సాధించవచ్చని సూచించారు. అనంతరం కేవీకే కోఆర్డినేటర్ ధనలక్ష్మి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ భూసార పరీక్షలు చేయించుకుని అనుగుణంగా ఎరువులు వాడడం వల్ల మంచి పలితాలు పొందుతారన్నారు. విచక్షణారహితంగా మందులు వాడకుండా సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. ఖరీప్ సాగుకు అనువైన వరి రకాలలో ఎన్డీఎల్ఆర్- 7, ఆర్ఎన్ఆర్-15048 అనువైనవిగా వివరించారు. రైతులకు అధిక ఆదాయం ఇచ్చే పండ్లు, కూరగాయల తోటలు సాగు చేయాలని సాగుకు ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తున్నట్లు జిల్లా ఉధ్యాన శాఖ అధికారి నాగరాజు తెలిపారు. శాస్త్రవేత్తలు సుధాకర్, సుగన్న, హపీజ్పర్వీన్, నంద్యాల వ్యవసాయ సహాయ సంచాలకులు రాజశేఖర్, ఏవో ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.