జీవో నెంబరు 77ను రద్దు చేయాలి
ABN , Publish Date - Jul 25 , 2025 | 01:02 AM
పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ను దూరం చేసే జీవో నెంబర్ 77ను ఎప్పుడు రద్దు చేయాలని పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు భాస్కర్ డిమాండ్ చేశారు.
నందికొట్కూరు, జూలై 24 (ఆంధ్రజ్యోతి): పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ను దూరం చేసే జీవో నెంబర్ 77ను ఎప్పుడు రద్దు చేయాలని పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు భాస్కర్ డిమాండ్ చేశారు. పట్టణంలోని సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలపై చర్చించి భవిష్యత్తు కార్యాచరణను రూపొందించేందుకు ఆగస్టు 4, 5, 6 తేదీల్లో నంద్యాల నగరంలో రాష్ట్ర తరగతులు నిర్వహిస్తు న్నామని తెలిపారు. రాష్ట్ర విద్యా, వైజ్ఞానిక తరగతులను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. విదేశీ విశ్వవిద్యాలయాలను దేశంలోకి ఆహ్వానిస్తూ యూనివర్సిటీలను ప్రైవేటీకరణ చేస్తున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం విద్యను నిర్వీర్యం చేస్తూ ప్రాథమిక పాఠశాలలను మూసివేసే జీవో 19, 20 లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు జునైద్బాషా, నంద్యాల కార్యదర్శి రాంబాబు, రాష్ట్ర నాయకులు ఆది, రమణ, డివిజన్ నాయకులు జగదీష్, అజయ్, శ్యామ్నాయక్ తదితరులు పాల్గొన్నారు.