శాస్త్రవేత్తల సూచనలు పాటించాలి
ABN , Publish Date - May 24 , 2025 | 11:52 PM
రైతులు పంటల సాగులో శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు పాటించాలని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ వి. జయలక్ష్మి తెలిపారు.
మహానంది, మే 24 (ఆంధ్రజ్యోతి): రైతులు పంటల సాగులో శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు పాటించాలని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ వి. జయలక్ష్మి తెలిపారు. శనివారం కళాశాల ఆవరణలో నంద్యాల జిల్లా దొర్నిపాడు మండలంలోని 200 మంది ఎస్సీ రైతులకు శనగపంట సాగులో సస్యరక్షణ చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కళాశాల డీన్ జయలక్ష్మి ఆధ్వర్యంలో ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా రైతులకు కళాశాల శాస్త్రవేత్తలు వివిధ వాణిజ్య పంటల సాగులో తీసుకోవాల్సిన సలహాలతో తద్వారా పంట దిగుబడిపై అవగాహన కల్పించారు. అనంతరం రైతులకు ఉచితంగా రూ. 16 లక్షల విలువైన వ్యవసాయ పనిముట్లతో పాటు నూతన శనగ విత్తనాలను కళాశాల డీన్ చేతుల మీదుగా పంపిణీ చేయించారు. పోగ్రాం కోఆర్డినేటర్ సుజాతమ్మ, కళాశాల శాస్త్రవేత్తలు తివిక్రమ్రెడ్డి, గురివిరెడ్డి, గీతా శిరీష, సుబ్బరామిరెడ్డి పాల్గొన్నారు.