ఆక్రమణలు తొలగించాలి
ABN , Publish Date - May 01 , 2025 | 12:03 AM
మున్సిపల్ ఆస్తులను ప్రతి ఒక్కరూ కాపాడాలని, ఆక్రమణలను అధికారులు తొలగించాలని మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నీసా, పలువురు కౌన్సిలర్లు చర్చించారు.
నంద్యాల టౌన్, ఏప్రిల్ 30(ఆంధ్రజ్యోతి): మున్సిపల్ ఆస్తులను ప్రతి ఒక్కరూ కాపాడాలని, ఆక్రమణలను అధికారులు తొలగించాలని మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నీసా, పలువురు కౌన్సిలర్లు చర్చించారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో బుధవారం కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ముందుగా ఉద్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయినవారికి రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం కౌన్సిల్ ప్రారంభించారు. సాయిబాబా నగర్ నుంచి రైల్వేస్టేషన్ వరకు రోడ్డు వెడల్పు చేయాలని చైర్పర్సన్ అజెండాలో పెట్టగా.. అది అంత రద్దీ ప్రదేశం, ఇప్పుడు అవసరం లేద ని కౌన్సిలర్ కృష్ణమోహన్ అభ్యంతరం తెలిపారు. వైఎస్ నగర్లోని మున్సిపాలిటీకి సంబంఽధించిన మూడెకరాల భూమిని కొందరు వ్యక్తులు రేకుల షెడ్డు వేసుకుని ఆక్రమించుకున్నారని 38వ వార్డు కౌన్సిలర్ సావిత్రమ్మ కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్లగా చైర్పర్సన్ వాటిని తొలగించాలని ఆదేశించారు. ప్రతాప్ థియేటర్వద్ద ఉన్న మున్సిపల్ స్థలాన్ని కొందరు అక్రమించుకుని వైన్ షాప్ పక్కనే ఉండడంతో సిట్టింగ్ ఏర్పాటు చేశారని, వాటిని తొలగించాలని కౌన్సిలర్ కలాం కోరారు. మార్కెట్లో దుకాణాలకు అద్దెలు ఒక్కొక్కరికి ఒక రకంగా ఉన్నాయని కో ఆప్షన్ మెంబర్ సలాముల్లా కౌన్సిల్ దృష్టికి తెచ్చారు. వార్డుల్లో పారిశుధ్యంను మెరుగుపర్చాలని కౌన్సిలర్లు కోరారు. ఆక్రమణలను తొలగించేలా చర్యలు తీసుకోవాలని ఎంఈకు, డీఈలకు సూచించారు. సమావేశంలో కమిషనర్ నిరంజన్రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ వెంకటదాస్, అధికారులు పాల్గొన్నారు.