పాడి పరిశ్రమ ఏర్పాటు చేసుకోవాలి: కలెక్టర్
ABN , Publish Date - Oct 30 , 2025 | 12:18 AM
రైతులు పంటలతో పాటు పాడి పరిశ్రమను కూడా ఏర్పాటు చేసుకుంటే చేదోడుగా ఉంటుందని కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి అన్నారు.
గోనెగండ్ల, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): రైతులు పంటలతో పాటు పాడి పరిశ్రమను కూడా ఏర్పాటు చేసుకుంటే చేదోడుగా ఉంటుందని కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి అన్నారు. బుధవారం కులుమాల గ్రామంలో ఆమె పర్యటించారు. గ్రామంలో వ్యవసాయశాఖ అధికారులు ఆధ్వర్యంలో జాతీయ ఆహార నూనె గింజల పథకం పట్ల రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. కలెక్టర్ సిరి ముఖ్య అఽథిదిగా వచ్చారు. రైతులకు నూతనంగా ఉత్పత్తి చేసిన టీసీజీఎస్ 1694 రకం వేశనగ విత్తనాలను మండలంలో 100 హెక్టార్లకు రూ. 7.10 లక్ష విలువైన 150 క్వింటాళ్లు విత్తనాలను రైతులకు ఉచితంగా పంపిణీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ రైతులు తప్పనిసరిగా ఏడాదికి మూడు రకాల పంటలను సాగు చేసుకోవాలని కోరారు. అలాగే ప్రతి రైతు పాడి పరిశ్రమ ను ప్రోత్సహించాలన్నారు. ఆవు, గేదే. మేక తదితర పాడి పశువులన పెంచుకోవాలని దీని ద్వార రైతు కుటుంబాలకు ఆర్థికంగా ఎంతో ఆసరగా ఉంటుందన్నారు. అధికారులు 157 రకాల నూనె జాతి మొక్కలను ఉచితంగా రైతులకు అందజేస్తున్నారని తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. రైతులు ఉల్లి పంటపైనే కాకుండా ఇతర పంటల ను కూడా సాగు చేసుకోవాలని ఈ ఏడాది ఉల్లి ధరలు రైతులకు ఆశాజనకంగా లేవని కావున ఇతర పంటలను కూడా సాగు చేసుకుంటే రైతులకు ఇబ్బందులు ఉండవని కలెక్టర్ రైతులకు సూచించారు. పంటలు యాజమాన్య పద్ధతుల గురించి, పత్తి మద్దతు ధర కు అమ్ముకునే రైతులు తప్పని సరిగా రైతు సేవా కేంద్రాలలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని కపాస్ కిసాన్ యాప్ నందు స్లాట్ బుక్ చేసుకోవాలని జేడీ వరలక్ష్మి వివరించారు. వెటర్నరీ జేడీ శ్రీనివాసులు పశుసంపదపై, వాటి ద్వారా రైతులకు వచ్చేరాబడి గురించి వివరించారు. ఇన్చార్జి ఆర్డీవో అజయ్, జేడీఏ వరలక్ష్మి, పశుసంవర్థన శాఖ అధికారి శ్రీనివాసులు, కృషి విజ్ఞాన్ కేంద్రం కోఆర్డినేటర్ రాఘవేంద్ర, ఇరిగేషన్ ఈఈ పాండురంగయ్య, తహసీల్దార్ రాజేశ్వరి, ఎంపీడీవో మణిమంజరి, ఏడీఏ మహుమ్మద్ఖాద్రీ, ఏవో హేమలత, సిబ్బంది పాల్గొన్నారు.