రస్తా కోసం ఆందోళన
ABN , Publish Date - Jan 07 , 2025 | 12:22 AM
పొలాలకు వెళ్లేందుకు రహదారి లేకుండా చేశారని, వెంటనే రస్తా ఏర్పాటు చేయాలని 10 బొల్లవరం రైతులు ఆందోళనకు దిగారు.

జాతీయ రహదారిపై ఎద్దుల బండ్లను, ట్రాక్టర్లను అడ్డం పెట్టిన రైతులు
నందికొట్కూరు రూరల్, జనవరి 6(ఆంధ్రజ్యోతి) : పొలాలకు వెళ్లేందుకు రహదారి లేకుండా చేశారని, వెంటనే రస్తా ఏర్పాటు చేయాలని 10 బొల్లవరం రైతులు ఆందోళనకు దిగారు. సోమవారం జాతీయ రహదారి 340 సీ 21వ కిలోమీటర్ వద్ద ఎద్దుల బండ్లను, ట్రాక్టర్లను అడ్డుపెట్టి వచ్చిపోయే వాహనాలను అడ్డుకున్నారు. 10 బొల్లవరం రైతులు తమ పొలాలకు వెల్లాలంటే రెండు కిలోమీటర్లు వెనక్కి నందికొట్కూరు సమీపంలో వున్న నాగలూటి యూ టర్న్ వద్దకు వెళ్లి తిరిగి రావలసి వస్తున్నది. దీనితో రైతులు తమ వూరి వద్ద డివైడర్ను తొలగించి ఎప్పటిలానే పొలాలకు దారి వదలాలని కోరుతూ నిరసన తెలిపారు. దీనితో కొద్దిసేపు జాతీయ రహదారిపై వాహనాల రాక పోకలకు అంతరాయం కలిగింది. ఈ విషయం తెలుసుకున్న జాతీయ రహదారి సైట్ మేనేజర్ వాసు, తహసీల్దార్ శ్రీనివాసులు, బ్రాహ్మణకొట్కూరు ఎస్సై తిరుపాలు వచ్చి రైతులకు సర్ది చెప్పడంతో ధర్నా విరమించారు. ఈ కార్యక్రమంలో రైతులు బాబురెడ్డి, వెంకటేశ్వర్లు, ఎల్లప్ప, దేవేంద్రరెడ్డి, మేకల మల్లయ్య, లక్ష్మీదేవమ్మ తదితరులు పాల్గొన్నారు.