దేవతలారా రండి
ABN , Publish Date - Mar 06 , 2025 | 11:32 PM
ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన అహోబిలంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. గురువారం బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ అర్చకులు ధ్వజపటావిష్కరణ, బేరి పూజ నిర్వహించారు.
దిగువ అహోబిలంలో ధ్వజారోహణం
సింహ వాహనంపై విహరించిన నృసింహుడు
వైభవంగా సాగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలు
ఆళ్లగడ్డ(శిరివెళ్ల), మార్చి 6(ఆంధ్రజ్యోతి): ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన అహోబిలంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. గురువారం బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ అర్చకులు ధ్వజపటావిష్కరణ, బేరి పూజ నిర్వహించారు. అహోబిల మఠం 46వ పీఠాధిపతి శ్రీవణ్ శఠగోప శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికన్ ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు కిడాంబి వేణుగోపాలన్, మణియార్ సౌమ్యనారాయణన్లు దిగువ అహోబిలంలో వేకువజామున ధ్వజారోహణ పూజలు నిర్వహించారు. ధ్వజస్తంభంపై గరుత్మంతుడి చిత్రపటాన్ని ఆవిష్కరణ చేశారు. స్వామి అమ్మవార్లకు అభిషేకం, విశేష పూజలు నిర్వహించి శ్రీదేవీ, భూదేవీ సమేత ప్రహ్లాదవరదస్వామి ఉత్సవమూర్తులను పట్టువస్త్రాలు, పూలమాలలతో అలంకరించి గ్రామోత్సవం నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రహ్లాదవరదస్వామిని సింహవాహనంపై కొలువుదీర్చి మాడవీధుల్లో వైభవంగా గ్రామోత్సవం నిర్వహించారు. దర్శనమివ్వనున్నారు.
హంస వాహనంపై నారసింహుడు
ఎగువ అహోబిలంలో శ్రీదేవి, భూదేవి సమేత నారసింహస్వామికి గురువారం రెండు వాహన సేవలు నిర్వహించారు. ముందుగా ఉత్సవమూర్తులకు అభిషేకం, విశేష పూజలు నిర్వహించారు. జ్వాలా నరసింహస్వామి ఉదయం హంస వాహనం, రాత్రి సూర్యప్రభ వాహనంపై కొలువుదీర్చి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. మాడవీధుల్లో శ్రీవారి గ్రామోత్సవం కన్నులపండువగా జరిగింది.