అక్రమ రిజిస్ట్రేషన్ రద్దు
ABN , Publish Date - Jan 16 , 2025 | 11:40 PM
వివాదాస్పద రిజిస్ట్రేషన్ను అధికారులు ఎట్టకేలకు రద్దు చేశారు. ఆదోని మండలం మండగిరి పంచాయతీ పరిధిలోని 321-ఏ సర్వే నెంబర్లోని 6.51 ఎకరాల స్థలం అక్రమ రిజిస్ట్రేషన్ను రద్దు చేసినట్లు సబ్ రిజిస్ట్రార్ అరుణ్ కుమార్ గురువారం వెల్లడించారు.

పోలీసుల అదుపులో ప్రధాన సూత్రధారి
ఆదోని, జనవరి16 (ఆంధ్రజ్యోతి): వివాదాస్పద రిజిస్ట్రేషన్ను అధికారులు ఎట్టకేలకు రద్దు చేశారు. ఆదోని మండలం మండగిరి పంచాయతీ పరిధిలోని 321-ఏ సర్వే నెంబర్లోని 6.51 ఎకరాల స్థలం అక్రమ రిజిస్ట్రేషన్ను రద్దు చేసినట్లు సబ్ రిజిస్ట్రార్ అరుణ్ కుమార్ గురువారం వెల్లడించారు. భూ యజమాని ఎగ్గటి ఈశ్వరప్ప బతికుండగానే డెత్ సర్టిఫికెట్ సృష్టించి, ఆధార్ కార్డు మార్పు చేసి తనే భూ యజమాని ఆముదాల భాస్కర్ మరొకరి పేరు మీద సదరు సర్వేనెంబర్ 321-ఏ లోని రూ.35కోట్ల విలువ చేసే భూమిని గత డిసెంబరు 31న రిజిస్ట్రేషన్ చేశారు. అసలు యజమాని ఎగ్గటి ఈశ్వరప్ప తన కుమారులతో కలిసి రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లి అక్రమ సబ్ రిజిస్ట్రార్ను నిలదీశారు. దీనిపై రెండో పట్టణ పోలీస్ స్టేషన్లోనూ కేసు నమోదు చేశారు. ఇప్పటికే పలువురిని అరెస్టు చేయగా అసలు సూత్రధారి అముదాల భాస్కర్ను పోలీసులు అదుపులో తీసుకొని విచారణ చేపట్టినట్లు తెలిసింది. నకిలీ డాక్యుమెంటుతో రిజిస్ట్రేషన్ చేసిన సబ్ రిజిస్ట్రార్ హాజీమీయాను మాత్రం ఇప్పటివరకు పోలీసులు అరెస్టు చేయలేదు. హాజీమీయా అరెస్టు అయితే అక్రమ రిజిస్ట్రేషన్ వెనుక ఉన్న వారి బండారం బయటపడుతుందన్న ఉద్ధేశంతోనే ఆయన్ను అరెస్టు చేయడం లేదంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారంలో కొంతమంది రాజకీయనాయకుల ప్రమేయం ఉందని, అందుకే సస్పెండయిన సబ్ రిజిస్ట్రార్ను అరెస్టు చేయడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు.