అర్జీలను త్వరగా పరిష్కరించాలి
ABN , Publish Date - Jan 07 , 2025 | 12:26 AM
అర్జీలను త్వరగా పరిష్కరించాలి

కలెక్టర్ పి. రంజిత్ బాషా
కర్నూలు కలెక్టరేట్, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ పి. రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా కలెక్టర్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ ఫిర్యాదుల పరిష్కారంపై అధికారులతో సమీక్షించారు. ఓర్వకల్లు మండల సర్వేయర్ వద్ద 165 పెండింగ్లో ఉన్నాయని, సర్వేయర్ ఏమి చేస్తున్నారని ఓర్వకల్లు తహసీల్దార్ను ప్రశ్నించారు. రెవెన్యూ సదస్సులు పూర్తి కావచ్చినా ఒక్క అర్జీ కూడా పరిష్కరించలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. మద్దికెర మండలంలో 81, ఎమ్మిగనూరులో 130, పత్తికొండలో 80, కౌతాళంలో 98, ఆలూరులో 111, ఆదోనిలో 37, కర్నూలులో 125, గోనెగండ్లలో 59 పెండింగ్లో ఉన్నాయని వాటిని రెండు రోజుల్లో పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం దివ్యాంగ అర్జీదారుల కోసం ఏర్పాటు చేసిన వీల్ చైర్స్ను పరిశీలించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ డా.బి. నవ్య, అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి, డీఆర్వో సి. వెంకట నారాయణమ్మ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ చిరంజీవి, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, కొండయ్య, జిల్లా అధికారులు పాల్గొన్నారు.