ఎఫ్1లో పడి మునిగిపోయారు
ABN , Publish Date - Feb 24 , 2025 | 12:59 AM
ఇద్దరు దంపతులకు షేర్ల పేరుతో వల వేసి సైబర్ నేరగాళ్లు రూ.91.62లక్షలు లాగేశారు. దీనిపై సైబర్ క్రైం పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు.

దంపతుల నుంచి రూ.91.62 లక్షలు లాగేసిన ఈ-కేటుగాళ్లు
విజయవాడ, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): ఇద్దరు దంపతులకు షేర్ల పేరుతో వల వేసి సైబర్ నేరగాళ్లు రూ.91.62లక్షలు లాగేశారు. దీనిపై సైబర్ క్రైం పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. నగరానికి చెందిన ఒక మహిళ కొద్దిరోజుల క్రితం వీఐపీ ఎఫ్1 హై పెర్ఫార్మామెన్స్ స్టాక్ సర్కిల్ వాట్సాప్ గ్రూపులో చేరింది. ఇందులో షేర్ల అమ్మకాలు, కొనుగోలు ప్రకటనలు వచ్చాయి. తర్వాత ఫైయర్స్ ఐటీ అనే వెబ్సైట్లో అకౌంట్ తెరిచారు. గ్రూపు చాటింగ్లో గుర్తుతెలియని వ్యక్తి తమ కంపెనీ మేనేజర్ ఆర్యన్ (8976044159)తో టచ్లో ఉండాలన్నారు. దీంతో ఆమె ఆ నంబర్కు ఫోన్ చేసి అతడి సూచనలతో రూ.26.99 లక్షలను వేర్వేరు మార్గాల్లో చెల్లించారు. అంతేకాక భర్త మరో రూ.64.63 లక్షలను బదిలీ చేశారు. వారికున్న అకౌంట్లో డబ్బులున్నట్టుగా చూపించడంతో విత్డ్రాకు ప్రయత్నించగా డబ్బులు తమ బ్యాంకు ఖాతాలో జమ కాకపోవడంతో మోసపోయినట్టుగా గుర్తించారు. దీంతో వారు 1930కి ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. అనంతరం సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేశారు.