Share News

Judge Farewell: జస్టిస్‌ మన్మథరావుకు హైకోర్టు ఘన వీడ్కోలు

ABN , Publish Date - May 10 , 2025 | 05:10 AM

కర్ణాటక హైకోర్టుకు బదిలీ అయిన జస్టిస్‌ కె. మన్మథరావుకు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఘన వీడ్కోలు పలికింది. 727 రోజుల్లో 11,972 కేసులు పరిష్కరించిన ఆయన సేవలను ప్రధాన న్యాయమూర్తి సహా పలువురు అభినందించారు

Judge Farewell: జస్టిస్‌ మన్మథరావుకు హైకోర్టు ఘన వీడ్కోలు

అమరావతి, మే 9(ఆంధ్రజ్యోతి): కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీపై వెళ్తున్న జస్టిస్‌ కె.మన్మథరావుకు రాష్ట్ర హైకోర్టు ఘనంగా వీడ్కోలు పలికింది. శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌ నేతృత్వంలో న్యాయమూర్తులు హైకోర్టులోని మొదటి కోర్టు హాలులో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. సీజే జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ మాట్లాడుతూ జస్టిస్‌ మన్మథరావు అందించిన న్యాయసేవలను కొనియాడారు. స్వల్ప వ్యవధిలో 11,972 కేసులు పరిష్కరించారన్నారు. పలు కీలక తీర్పులు ఇచ్చారని పేర్కొన్నారు. అడ్వకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌, ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కె.చిదంబరం, అడిషనల్‌ సొలిసిటర్‌ జనరల్‌ చల్లా ధనంజయ మాట్లాడారు.


జస్టిస్‌ మన్మథరావుకు న్యాయవ్యవస్థలో అపార అనుభవం ఉందన్నారు. అనంతరం న్యాయమూర్తి జస్టిస్‌ మన్మథరావు మాట్లాడుతూ న్యాయమూర్తిగా నియమితులైనప్పటి నుండి 727 రోజుల్లో 11,972 కేసులు పరిష్కరించడం సంతోషంగా ఉందన్నారు. విధి నిర్వహణలో సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, జస్టిస్‌ మన్మథరావు కుటుంబసభ్యులు, అడిషనల్‌ అడ్వకేట్‌ జనరల్‌ సాంబశివ ప్రతాప్‌, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ మెండ లక్ష్మీనారాయణ, డిప్యూటీ సొలిసిటర్‌ జనరల్‌ పసల పొన్నారావు, హైకోర్టు రిజిస్ట్రార్‌లు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - May 10 , 2025 | 05:10 AM