CM Chandrababu: జమ్మూకశ్మీర్ అభివృద్ధిలో నూతన అధ్యాయం
ABN , Publish Date - Jun 07 , 2025 | 04:21 AM
ప్రధాని మోదీ నాయకత్వంలో జమ్మూకశ్మీర్ అభివృద్ధిలో నూతన అధ్యాయం మొదలైందని సీఎం చంద్రబాబు అన్నారు. శుక్రవారం ఆయన ఎక్స్లో స్పందించారు.
చీనాబ్, అంజి రైల్వే వంతెనలపై సీఎం హర్షం
అమరావతి, జూన్ 6(ఆంధ్రజ్యోతి): ప్రధాని మోదీ నాయకత్వంలో జమ్మూకశ్మీర్ అభివృద్ధిలో నూతన అధ్యాయం మొదలైందని సీఎం చంద్రబాబు అన్నారు. శుక్రవారం ఆయన ఎక్స్లో స్పందించారు. ‘క్లిష్టమైన భౌగోళిక పరిస్థితుల్లో నిర్మించిన రెండు అద్భుత ప్రాజెక్టులను జాతికి అంకితం చేసినందుకు ప్రధానికి అభినందనలు. ప్రపంచంలో ఎత్తైన రైలు ఆర్చి వంతెన చీనాబ్. దేశంలోనే తొలి కేబుల్ స్టెయిడ్ రైలు వంతెన అంజి. ఈ రెండు ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా ఉదంపూర్ - శ్రీనగర్ - బారాముల్లా నడుమ రైల్వే అనుసంధానం పెరిగి ఆధ్యాత్మిక పర్యాటకానికి ఊపు లభిస్తుంది. ఉద్యోగ అవకాశాలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ రైల్వే లైను అనుసంధానంతో వైష్ణోదేవి మాత ఆలయానికి శ్రీనగర్కు నడుమ వందేభారత్ రైళ్లు ఏడాది పొడవునా తిరిగే అవకాశం ఏర్పడింది’ అని చంద్రబాబు పేర్కొన్నారు. మరో సందేశంలో... ‘విశాఖ సౌత్ కోస్ట్ రైల్వే జోన్ జీఎంగా సందీప్ మాధుర్ని నియమించడం ద్వారా విశాఖ జోన్ కలను మరింత ముందుకు తీసుకెళ్లిన రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర రైల్వే మంత్రికి కృతజ్ఞతలు’ అని సీఎం పేర్కొన్నారు.