IPS PSR Anjaneyulu: రిమాండ్ ఉత్తర్వులు కొట్టేయండి
ABN , Publish Date - May 02 , 2025 | 05:37 AM
ముంబై నటి కాదంబరి కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు తనపై ట్రయల్ కోర్టు ఇచ్చిన రిమాండ్ ఉత్తర్వులను హైకోర్టులో సవాలు చేశారు. ఆయనకు జైలులో తగిన సదుపాయాలు కల్పించాలని కోరుతూ బెయిల్ పిటిషన్ దాఖలయ్యింది
హైకోర్టులో ఐపీఎస్ పీఎస్సార్ పిటిషన్
కౌంటర్కు సమయం కోరిన ప్రాసిక్యూషన్
అమరావతి, మే 1 (ఆంధ్రజ్యోతి): ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో తనపై సీఐడీ కోర్టు ఇచ్చిన రిమాండ్ ఉత్తర్వులను కొట్టివేయాలని సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎ్సఆర్ ఆంజనేయులు హైకోర్టును కోరారు. ఆయన దాఖలు చేసిన పిటిషన్ గురువారం విచారణకు వచ్చింది. ఆయన తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపించారు. కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదు ఆధారంగా నమోదు చేసిన కేసు పెండింగ్లో ఉండగా.. జెత్వానీ ఫిర్యాదుతో కేసు పెట్టడానికి వీల్లేదన్నారు. విచారణకు రావాలని పోలీసులిచ్చిన నోటీసులకు స్పందించలేదనే కారణంతో పిటిషనర్కు ట్రయల్ కోర్టు రిమాండ్ విధించిందని.. వ్యక్తిగత స్వేచ్ఛతో ముడిపడి ఉన్నందున వ్యాజ్యంపై సాధ్యమైనంత త్వరగా విచారణ జరపాలని కోరారు. ప్రాసిక్యూషన్ తరఫున అడ్వకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ స్పందిస్తూ.. వ్యాజ్యం మొదటిసారి విచారణకు వచ్చిందన్నారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని.. అందుకు సమయం ఇవ్వాలని కోరారు. అందుకు అంగీకరించిన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.హరినాథ్.. విచారణను ఈ నెల ఆరో తేదీకి వాయిదా వేశారు.
ఐపీఎస్ల క్వాష్ పిటిషన్లపై విచారణ 8కి వాయిదా
నటి జెత్వానీ ఫిర్యాదు ఆధారంగా ఇబ్రహీంపట్నం పోలీసులు తమపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ ఐపీఎస్ అధికారులు కాంతిరాణా తాతా, విశాల్ గున్ని, అప్పటి ఏసీపీ కె.హనుమంతరావు, దర్యాప్తు అధికారి కె.సత్యనారాయణ వేసిన క్వాష్ పిటిషన్లపై విచారణను హైకోర్టు 8కి వాయిదా వేసింది. గురువారం ఈ వ్యాజ్యాలు మరోసారి విచారణకు రాగా ప్రాసిక్యూషన్ తరఫున ఏజీ వాదనలు వినిపించారు. పిటిషనర్లు ఇప్పటికే ముందస్తు బెయిల్ పొందారని.. ప్రస్తుత కేసులో నోటీసులిచ్చి విచారణకు పిలువబోమని, తుది చార్జిషీటు దాఖలు చేయబోమని గతంలోనే హామీ ఇచ్చామని గుర్తుచేశారు. పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాదులు స్పందిస్తూ.. మరో కేసులో (కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదు ఆధారంగా నమోదైన కేసు) నోటీసులిచ్చి విచారణకు పిలుస్తున్నారని.. తదుపరి చర్యలపై స్టే విధించాలని కోరారు. ఏజీ జోక్యం చేసుకుంటూ.. ప్రస్తుత కేసులో పిటిషనర్లకు ఎలాంటి నోటీసులూ ఇవ్వలేదని.. ఇచ్చి ఉంటే వాటిని కోర్టు ముందుంచాలన్నారు. మరో కేసులో విచారణకు రమ్మని కోరితే తప్పేమందని ప్రశ్నించారు. వ్యాజ్యాలపై కౌంటర్ వేస్తామని, విచారణను 8వ తేదీకి వాయిదా వేయాలని కోరారు. దీంతో న్యాయమూర్తి హరినాథ్ అప్పటికి వాయిదావేస్తూ ఉత్తర్వులిచ్చారు.
జెత్వానీపై నేనెవరికీ ఆదేశాలివ్వలేదు
జైలులో సదుపాయాలు కల్పించండి: పీఎస్సార్
ముంబై నటి కాదంబరి జెత్వానీపై కేసు వ్యవహారంలో తాను ఏ అధికారికీ ఎలాంటి సూచనలు, ఆదేశాలూ ఇవ్వలేదని అప్పటి నిఘా విభాగం చీఫ్, సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్సార్ ఆంజనేయులు స్పష్టంచేశారు. బెయిల్ కోసం, జైల్లో సదుపాయాల కోసం ఆయన దాఖలు చేసిన పిటిషన్పై గురువారం విజయవాడ మూడో అదనపు చీఫ్ జుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో విచారణ జరిగింది. ఆయన తరఫున న్యాయవాది విష్ణువర్ధన్ వాదనలు వినిపించారు. ఈ కేసులో పీఎస్సార్కు ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ఎలాంటి సంబంధమూ లేదన్నారు. ఈ కేసు విషయంలోనే ఆయన అప్పటి సీఎంవోకు వెళ్లారన్న ఆరోపణల్లో కూడా వాస్తవం లేదని తెలిపారు. ఆయన డీజీ స్థాయి అధికారి అయినందున జైలులో తగు సదుపాయాలు కల్పించాలని కోరారు. ప్రాసిక్యూషన్ తరఫు వాదనల కోసం కోర్టు విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.