IG A.K. Ravikrishna : గంజాయి సాగు వీడండి
ABN , Publish Date - Jan 07 , 2025 | 05:27 AM
గిరిజనులు గంజాయి సాగు వీడాలని ‘ఈగిల్’ (ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్) ఐజీ ఆకే రవికృష్ణ పిలుపునిచ్చారు.

గిరిజనులకు ఈగిల్ ఐజీ ఆకే రవికృష్ణ పిలుపు
అల్లూరి జిల్లాలో గంజాయి తోటల ధ్వంసం
పెదబయలు, జనవరి 6(ఆంధ్రజ్యోతి): గిరిజనులు గంజాయి సాగు వీడాలని ‘ఈగిల్’ (ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్) ఐజీ ఆకే రవికృష్ణ పిలుపునిచ్చారు. సోమవారం అల్లూరి జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్తో కలసి ఆయన పెదబయలు మండలం పాతపాడు గ్రామాన్ని సందర్శించారు. అక్కడ 8ఎకరాల్లో గంజాయి సాగు చేస్తున్నట్టు డ్రోన్ల ద్వారా గుర్తించి ధ్వంసం చేశారు. గంజాయి సాగు చేస్తున్న రైతులపై కేసులు నమోదు చేయాలని స్థానిక ఎస్ఐ కె.రమణను ఆదేశించారు. అనంతరం గ్రామస్థులతో ఐజీ మాట్లాడుతూ గంజాయిని వదిలి ఇతర పంటలు సాగు చేసుకోవాలని సూచించారు. గంజాయి అనేక ప్రాణాలను బలిగొంటోందని, దానిని రవాణా చేస్తూ పట్టుబడిన వందలాది యువకులు జైళ్లలో మగ్గుతున్నారని, వారిలో గిరిజన ప్రాంతానికి చెందినవారే ఎక్కువని చెప్పారు. జిల్లాలో ఎక్కడ గంజాయి సాగవుతోందో పోలీసులకు తెలుసని, వాటిని రైతులే స్వచ్ఛందంగా ధ్వంసం చేయాలని, లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.