HIgh Court: Order: కరువు మండలాల స్కూళ్లలో మిడ్ డే మీల్స్పై వివరాలివ్వండి
ABN , Publish Date - Apr 17 , 2025 | 05:53 AM
వేసవి సెలవుల్లో కూడా కరువు మండలాల్లోని విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం (మిడ్ డే మీల్స్) అమలు చేయాలన్న పిల్పై హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని సమగ్ర వివరాలు సమర్పించాలని ఆదేశించింది. వివరాలు ఇవ్వకపోతే సీఎస్ను ఆన్లైన్ ద్వారా హాజరుపరచాలంటూ హెచ్చరించింది
ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
అమరావతి, ఏప్రిల్ 16(ఆంధ్రజ్యోతి): వేసవి సెలవుల్లోనూ కరువు ప్రభావిత మండలాల్లోని విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని కోరుతూ దాఖలైన పిల్పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. దీనిపై వివరాలు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలు, పీఎం పోషణ్ మార్గదర్శకాల ప్రకారం పథకం అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పింది. వివరాలు అందజేయకుంటే ఆన్లైన్ ద్వారా సీఎస్ హాజరుకు ఆదేశిస్తామని తెలిపింది. ఈమేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది. వేసవి సెలవుల్లో కరువు మండలాల్లోని విద్యార్థులకు భోజన పథకం అమలు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ కాకినాడకు చెందిన ‘హెల్ప్ ది పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కీతినీడి అఖిల్ శ్రీ గురుతేజ పిల్ వేశారు. పిటిషనర్ తరఫున తాండవ యోగేష్ వాదనలు వినిపించారు. పథకం అమలుపై నిర్ణయం తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరగా, దీనిపై కేంద్రానికి ప్రతిపాదనలు పంపించామని ప్రభుత్వ న్యాయవాది జయంతి చెప్పారు.