Mohit Reddy: మోహిత్రెడ్డిపై తొందరపాటు చర్యలొద్దు
ABN , Publish Date - Jul 17 , 2025 | 03:45 AM
మద్యం కుంభకోణం కేసులో చెవిరెడ్డి మోహిత్రెడ్డిపై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దంటూ గతంలో ఇచ్చిన..
మధ్యంతర ఉత్తర్వులు 23 వరకు పొడిగించిన హైకోర్టు
అమరావతి, జూలై 16(ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణం కేసులో చెవిరెడ్డి మోహిత్రెడ్డిపై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు ఈ నెల 23 వరకు పొడిగించింది. ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్పై విచారణను 23వ తేదీకి వాయిదా వేసింది. బుధవారం హైకోర్టు సింగిల్ జడ్జి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. మద్యం కుంభకోణం కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్రెడ్డి కుమారుడు మోహిత్రెడ్డి హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది సి.నాగేశ్వరరావు వాదనలు వినిపిస్తూ... ఈ కేసులో పిటిషనర్ను నిందితుడిగా(ఏ39)గా చేర్చారన్నారు. మోహిత్రెడ్డి తండ్రి వద్ద పనిచేసిన సెక్యూరిటీ సిబ్బంది ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా పిటిషనర్ను నిందితుడిగా చేర్చారన్నారు. పిటిషన్పై విచారణను వాయిదా వేయాలని కోరారు. పిటిషనర్పై తొందరపాటు చర్యలు వద్దంటూ ఇదే హైకోర్టులోని మరో న్యాయమూర్తి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారని, వాటిని పొడిగించాలని కోరారు.