Junior Lecturers: జేఎల్స్కు పనితీరు పాయింట్లు
ABN , Publish Date - May 23 , 2025 | 05:44 AM
పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వం జూనియర్ లెక్చరర్ల బదిలీలకు అనుమతిచ్చి, మే 22 నుంచి జూన్ 8 వరకు ఆన్లైన్లో బదిలీల షెడ్యూల్ ప్రకటించింది. ఈసారి పనితీరు పాయింట్ల ఆధారంగా బదిలీలు జరుగుతాయని, వేర్వేరు హెచ్ఆర్ఏ కేటగిరీలకు అనుగుణంగా పాయింట్లు కేటాయిస్తున్నారని అధికారులు తెలిపారు.
విద్యార్థుల ఉత్తీర్ణతే ప్రామాణికం.. బదిలీలకు షెడ్యూలు విడుదల
అమరావతి, మే 22(ఆంధ్రజ్యోతి): జూనియర్ లెక్చరర్ల బదిలీలకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ నెల 22 నుంచి జూన్ 8 వరకు బదిలీల షెడ్యూలుగా పేర్కొన్నారు. ఈసారి కొత్తగా బదిలీల్లో పనితీరు పాయింట్లు ఇస్తున్నారు. ప్రస్తుత కాలేజీలో ఐదేళ్లు దాటిన ప్రిన్సిపాళ్లు, జూనియర్ లెక్చరర్లు తప్పనిసరిగా బదిలీ కావాలి. రెండేళ్లు దాటిన వారు కావాలంటే బదిలీకి దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం ఆన్లైన్ విధానంలోనే బదిలీలు జరుగుతాయి. నాలుగు కేటగిరీలుగా ప్రిన్సిపాళ్లు, జేఎల్స్కు పాయింట్లు ఇస్తారు. 16శాతం హెచ్ఆర్ఏ ఉన్న కేటగిరీ-ఎలో ఉంటే ఏడాదికి 2 పాయింట్లు, 12శాతం హెచ్ఆర్ఏ ప్రాంతం కేటగిరీ-బిలోని జేఎల్స్కు ఏడాదికి 4పాయింట్లు, 10శాతం హెచ్ఆర్ఏ కేటగిరీ-సి ఉన్న జేఎల్స్కు ఏడాదికి 6, గిరిజన ప్రాంతాల్లో కేటగిరీ-డి ఏడాదికి 8 పాయింట్లు ఇస్తారు. ఎ కేటగిరీలో ఉన్నవారు బీ, సీ, డీ కేటగిరీలకు మాత్రమే అర్హులు. మిగిలిన కేటగిరీల్లో వారు అన్ని కేటగిరీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. జేఎల్స్కు.. వారి సబ్జెక్టులో 40శాతం వరకు మాత్రమే విద్యార్థులు ఉత్తీర్ణులైతే పనితీరు పాయింట్లు ఇవ్వరు. 41 నుంచి 60శాతం వరకు పాస్ అయితే 2, 61 నుంచి 80శాతం వరకు అయితే 4, 81శాతం నుంచి 100శాతం లోపు ఉంటే 6 పాయింట్లు ఇస్తారు. ప్రిన్సిపాళ్లకు ఇదే నిష్పత్తిలో కాలేజీని ప్రాతిపదికగా తీసుకుని పాయింట్లు ఇస్తారు.
ఈ వార్తలు కూడా చదవండి..
భారత రాయబార కార్యాలయ సిబ్బందిని బహిష్కరించిన పాక్
For National News And Telugu News