ఉచిత ఇసుకతో ఆదాయానికి గండి: గనులశాఖ
ABN , Publish Date - Feb 12 , 2025 | 04:27 AM
కూటమి సర్కారు అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానం రాష్ట్ర ఖజానాపై ప్రభావం చూపుతోంది.

అమరావతి, ఫిబ్రవరి 11(ఆంధ్రజ్యోతి): కూటమి సర్కారు అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానం రాష్ట్ర ఖజానాపై ప్రభావం చూపుతోంది. దీని కారణంగా ఇసుకపై రావాల్సిన ఆదాయం భారీగా తగ్గిపోయింది. 2024-25లో గనులశాఖ ఆదాయం 2,420కోట్లు ఉండగా, 2025-26లో అది రూ.2,166 కోట్లే వస్తుందని ఆ శాఖ అంచనా వేసింది. మంగ ళవారం నిర్వహించిన కార్యదర్శుల సమావేశంలో శాఖ కార్యదర్శి మీనా నివేదిక ఇచ్చారు. లీజుదారుల నుంచి 3 నెలల పాటు ఫీజులు వసూలు చేయకపోవడం, క్వార్ట్జ్, సిలికా శాండ్ పర్మిట్లను 3 నెలల పాటు నిలిపివేయడం కూడా ఆదాయం తగ్గడానికి కారణాలుగా పేర్కొన్నారు. కొత్త మైనింగ్ పాలసీ ద్వారా ఆదాయం పెంచుతామని నివేదించారు. గత సెప్టెంబరులో ఉచిత ఇసుక అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజలకు రికార్డు స్థాయిలో 67 లక్షల టన్నుల ఇసుక పంపిణీ చేశామని తెలిపారు. వచ్చే 2 నెలల్లో భారీ, చిన్న తరహా ఖనిజాల నుంచి కనీసం రూ.1,100 కోట్ల ఆదాయం తీసుకొస్తామని, లీజు కాంట్రాక్టు దారుల నుంచి పెండింగ్ బకాయిలు, డెడ్రెంట్ వసూలు చేస్తామని గనుల శాఖ నివే దించింది.