Excise Department: కిక్కురుమనని ఎక్సైజ్ శాఖ
ABN , Publish Date - Jun 18 , 2025 | 05:02 AM
కానిస్టేబుళ్లపై వేధింపుల అంశంపై ఎక్సైజ్ శాఖ మౌనం దాల్చింది. శాఖలోని ఓ కీలక అధికారి కొన్ని నెలలుగా ఆరుగురు కానిస్టేబుళ్లను ఇంటి పనులకు వినియోగించుకుంటున్న విషయాన్ని మంగళవారం ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తీసుకొచ్చింది.
కానిస్టేబుళ్లపై వేధింపులు కొనసాగింపు
అమరావతి, జూన్ 17(ఆంధ్రజ్యోతి): కానిస్టేబుళ్లపై వేధింపుల అంశంపై ఎక్సైజ్ శాఖ మౌనం దాల్చింది. శాఖలోని ఓ కీలక అధికారి కొన్ని నెలలుగా ఆరుగురు కానిస్టేబుళ్లను ఇంటి పనులకు వినియోగించుకుంటున్న విషయాన్ని మంగళవారం ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ కథనంతో శాఖలోని ఉన్నతాధికారులు ఉలిక్కిపడ్డారు. ఈ విషయం ఎలా బయటికి వచ్చిందని ఆరా తీశారు. మరోవైపు ప్రభుత్వ స్థాయిలోనూ ఈ వేధింపులపై సమాచారం సేకరించారు. విషయం బయటికొచ్చినా మంగళవారం కూడా కానిస్టేబుళ్లను ఉన్నతాధికారి ఇంటి పనులకు వినియోగించుకున్నారు. ఏ పని చెప్పినా చేయాల్సిందేనని, ఫోన్లు ఇంటిబయటే పెట్టి రావాలని ఉన్నతాధికారి కుటుంబసభ్యులు వేధిస్తున్నట్లు తెలిసింది.