నేటి నుంచి ప్రతీ మూడో శనివారం..
ABN , Publish Date - Jan 18 , 2025 | 12:13 AM
ప్రతీ నెల మూడో శనివారం స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛదివస్ కార్యక్రమం అమలులో భాగంగా కోనసీమ జిల్లాను పరిశుభ్రత జిల్లాగా తీర్చి దిద్దాలని కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ అధికారులను ఆదేశించారు.

అమలాపురం, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): ప్రతీ నెల మూడో శనివారం స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛదివస్ కార్యక్రమం అమలులో భాగంగా కోనసీమ జిల్లాను పరిశుభ్రత జిల్లాగా తీర్చి దిద్దాలని కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో శుక్రవారం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంపై నియోజకవర్గస్థాయి ప్రత్యేక అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించి విధి విధానాలపై పలు సూచనలు చేశారు. తొలుత చెత్తాచెదారం ఎక్కడ ఉందో గుర్తించి డంపింగ్ యార్డుకు తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని, గ్రామాల్లోని డ్రైనేజీల్లో పూడికతీతలు చేపట్టి లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ చర్యలు చేపట్టాలన్నారు. శనివారం ఎమ్మెల్యే ల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. దీంట్లో కమ్యూనిటీ మరుగుదొడ్ల నిర్మాణానికి ఆస్కారం ఉన్నందున ప్రతీ కార్యాలయం, స్టేడియం, వసతిగృహాలు, మార్కెట్ యార్డులు, రైతుబజార్లు, పాఠశాలల్లో మరుగుదొడ్ల అవసరాన్ని గుర్తించి ఆయా వివరాలను ఆర్డబ్ల్యుఎస్ ఎస్ఈ కార్యాలయానికి నివేదిస్తే అంచనాలను రూపొందిస్తారన్నారు. ఎంపీడీవోలు, పంచాయతీ అధికారుల సమన్వయంతో మండల ప్రత్యేక అధికారులు పరిశుభ్రత అంశాల పట్ల గార్బెజ్ క్లీనింగ్, ఓవర్హెడ్ ట్యాంకులను శుభ్రంచేయడం వంటి వాటిపై దృష్టి సారించాలన్నారు. అమృత్ సరోవర్ కార్యక్రమంలో భాగంగా ప్రతీ నియోజకవర్గంలో రెండు చెరువులను అభివృద్ధి చేయాలన్నారు. అన్నివర్గాల ప్రజలను భాగస్వాములను చేయాలన్నారు. సమావేశంలో డీఈవో డాక్టర్ షేక్ సలీంబాషా, డీపీవో డి.శాంతలక్ష్మి, డ్వామా పీడీ ఎస్.మధుసూదన్, డీఎస్డీవో పీఎస్ సురేష్కుమార్, డ్రైనేజీ డివిజనల్ ఇంజనీర్ ఎంవీవీ కిశోర్, ఆర్డబ్ల్యు ఎస్ఎస్ఈ సీహెచ్ఎన్వీ కృష్ణారెడ్డి, పంచాయతీరాజ్ ఎస్ఈ రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.