గణతంత్ర వేడుకల విజయవంతానికి సన్నద్ధం కావాలి
ABN , Publish Date - Jan 21 , 2025 | 11:55 PM
76వ గణతంత్ర వేడుకలను అమలాపురం జీఎంసీ బాలయోగి స్టేడియంలో ఈ నెల 26న ఘనంగా నిర్వహించేందుకు సర్వసన్నద్ధం కావాలని జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి అధికారులను ఆదేశించారు. ప్రతీ ప్రభుత్వ శాఖలో విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందించే విధంగా జిల్లాస్థాయి అధికారులు జాబితాలను సిద్ధం చేయాలన్నారు.
జాయింట్ కలెక్టర్ నిషాంతి
అమలాపురం, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): 76వ గణతంత్ర వేడుకలను అమలాపురం జీఎంసీ బాలయోగి స్టేడియంలో ఈ నెల 26న ఘనంగా నిర్వహించేందుకు సర్వసన్నద్ధం కావాలని జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి అధికారులను ఆదేశించారు. ప్రతీ ప్రభుత్వ శాఖలో విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందించే విధంగా జిల్లాస్థాయి అధికారులు జాబితాలను సిద్ధం చేయాలన్నారు. కలెక్టరేట్లో గణతంత్ర వేడుకల ఏర్పాట్లపై మంగళవారం జిల్లాస్థాయి అధికారులతో జేసీ సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలోని వివిధ విభాగాల అధికారులు సమన్వయం చేసుకుని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రధాన వేదిక వద్ద ప్రజాప్రతినిధులు, అధికారులు మీడియాకు సిట్టింగ్ ఏర్పాట్లు, ప్రోటోకాల్ను ఆర్డీవో చేపట్టాలని ఆదేశించారు. ఆర్డబ్ల్యూఎస్, మున్సిపల్ అధికారులు సమన్వయంతో పారిశుధ్య ఏర్పాట్లు తాగునీటి సదుపాయం కల్పించాలన్నారు. జిల్లా విద్యాశాఖాధికారి ఆధ్వర్యంలో ఎన్సీసీ కార్యక్రమాల నిర్వహణ, సాంస్కృతిక కార్యక్రమాలకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలన్నారు. డీఐపీఆర్వో, సీపీవోల సహకారంతో జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రగతి నివేదికలను సిద్ధంచేసి ముఖ్య అతిథులకు ప్రసంగ నివేదికలుగా తయారు చేయాలన్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, చేనేత జౌళిశాఖ, పంచాయతీరాజ్, జిల్లా నీటి యాజమాన్య సంస్థ, వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోని 104 సంచార వైద్యసేవలు, 108 అత్యవసర వైద్యసేవల విభాగాలకు సంబంధించి సాధించిన ప్రగతిని ప్రతిబింబించేలా శకటాలను రూపొందించి పోటీల నిర్వహణకు సిద్ధం చేయాలని ఆదేశించారు. సమావేశంలో డీఆర్వో బీఎల్ఎన్ రాజకుమారి, ఆర్డీవో కె.మాధవి, డీఎంహెచ్వో డాక్టర్ ఎం.దుర్గారావుదొర, మున్సిపల్ కమిషనర్ కేవీఆర్ఆర్ రాజు, డీఐపీఆర్వో కె.లక్ష్మీనారాయణ, వికాస జిల్లా మేనేజర్ గోళ్ల రమేష్, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.