మార్చి 10 నుంచి పేదల గుర్తింపునకు చట్టబద్ధమైన సర్వే
ABN , Publish Date - Feb 07 , 2025 | 12:30 AM
పేదరికంలో అట్టడుగున ఉన్న 20శాతం మందిని గుర్తించేందుకు మార్చి 10 నుంచి చట్టబద్ధమైన సర్వే నిర్వహించాలని కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ ఆదేశించారు. స్వర్ణాంధ్ర విజన్-2047 డాక్యుమెంట్లో మొదటి సూత్రమైన జీవో ప్రోవర్టీ లక్ష్యాన్ని సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్, ప్రైవేట్ పీపుల్స్ పార్టనర్షిప్ పి-4 విధానాన్ని రూపొందించిందన్నారు.

అమలాపురం, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): పేదరికంలో అట్టడుగున ఉన్న 20శాతం మందిని గుర్తించేందుకు మార్చి 10 నుంచి చట్టబద్ధమైన సర్వే నిర్వహించాలని కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ ఆదేశించారు. స్వర్ణాంధ్ర విజన్-2047 డాక్యుమెంట్లో మొదటి సూత్రమైన జీవో ప్రోవర్టీ లక్ష్యాన్ని సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్, ప్రైవేట్ పీపుల్స్ పార్టనర్షిప్ పి-4 విధానాన్ని రూపొందించిందన్నారు. గురువారం కలెక్టరేట్లో తొలుత రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం జిల్లాస్థాయి అధికారులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గించి ప్రతీ ఒక్కరి జీవన ప్రమాణాలను పెంచేందుకు జన్మభూమి స్ఫూర్తితో పీ-4 విధానాన్ని ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు. పేదలు ఆర్థిక సంస్కరణలతో ఉన్నత స్థితికి చేరుకోవాలని లక్ష్యంగా నిర్దేశించిందన్నారు. పేదలను గుర్తించే సర్వే మార్చి 20 వరకు చట్టబద్ధంగా నిర్వహించాలని ఆదేశించారు. సర్వే ద్వారా గుర్తించిన పేదలకు ప్రభుత్వ పథకాలు, సీఎస్సార్ నిధులు, ఎన్ఆర్ఐల సహకారంతో కనీస జీవన ప్రమాణాలను మెరుగు పరిచేందుకు ప్రభుత్వం సంకల్పించిందన్నారు. సర్వేలో పంచాయతీరాజ్, మున్సిపల్, సచివాలయ ఉద్యోగులు పాల్గొంటారన్నారు. కాలుష్య నియంత్రణ నిర్వహణలో భాగంగా జిల్లాలో సమగ్ర బయోగ్యాస్ యూనిట్లు నెలకొల్పేందుకు అవసరమైన భూసేకరణ ప్రక్రియ చేపట్టాలని ఆదేశించారు. సీపీవో వెంకటేశ్వర్లుతో పాటు జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.