రోడ్డుపైనే వాహనాల పార్కింగ్
ABN , Publish Date - Jan 17 , 2025 | 11:43 PM
రావులపాలెం కళా వెంకట్రావు సెంటర్ వద్ద గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోతుండటంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

రావులపాలెం, జనవరి 17(ఆంధ్రజ్యోతి): రావులపాలెం కళా వెంకట్రావు సెంటర్ వద్ద గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోతుండటంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రావులపాలెం ఆర్టీసీ కాంప్లెక్స్, గ్రామంలోకి ప్రవేశించే రింగ్ రోడ్డు, జాతీయ రహదారి సెంటర్కి చేరువుగా ఉండటంతో ఒకపక్క జాతీయ రహదారిపై వాహనాలు వెళుతుంటే మరోపక్క కోనసీమ ముఖద్వారం వైపు నుంచి వాహనాలు ఇష్టానుసారంగా రావడంతో ట్రాఫిక్ జామ్ నిత్యకృత్యంగా మారింది. రావులపాడు హాస్పటల్ సెంటర్ వద్ద నుంచి కళా వెంకట్రావు సెంటర్ వరకు ఇరువైపులా ఉన్న సర్వీసు రోడ్డులో బిర్యానీ పాయింట్లు, థియేటర్లు, రెస్టారెంట్లు, లాడ్జీలు ఉండటంతో రోడ్డుపై పార్కింగ్ చేస్తున్నారు. మరోపక్క తోపుడు బండ్ల వర్తకులు వ్యాపారాలు సాగిస్తుండటంతో కొనుగోలు చేసేందుకు వచ్చిన వారితో ట్రాఫిక్ మరింత నరకప్రాయంగా మారింది. పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించిన సమయంలో బండ్లు పక్కకు తీసేస్తూ, మరలా పోలీసులు వెళ్లగానే యథాతదంగా పార్కింగ్ చేస్తుండటంతో ఇబ్బం దులు తప్పడం లేదు. సర్వీస్ రోడ్డులలో వాహనాలు పార్కింగ్ చేసే వారిపై చర్యలు తీసు కోవాలని ప్రయాణికులు, పాదచారులు కోరుతున్నారు. కళా వెంకట్రావు సెంటర్ వద్ద ట్రాఫిక్ నియంత్రణపై పోలీసులు దృష్టిసారించాలని పలువురు కోరుతున్నారు.