Share News

ఉల్లిక్కిపడ్డారు!

ABN , Publish Date - Mar 04 , 2025 | 12:06 AM

కాకినాడ క్రైం, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): కాకినాడలోని ఓ ట్రాన్స్‌పోర్ట్‌ కంపెనీలో సోమవారం ఉల్లిబాంబుల భారీ పేలుడు సంభవించి ఐదుగురు హమాలీలకు గాయాలయ్యాయి. ఈ ఘటనలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కాకినాడ జగన్నాథపురం కమర్షియల్‌ రోడ్డులోని వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరం ఉన్న జై బాలాజీ ట్రాన్స్‌పోర్ట్‌ కంపెనీకి హైదరాబాద్‌లో ఉన్న అదే ట్రాన్స్‌పోర్ట్‌ కంపెనీ నుంచి సోమవారం ఉ

ఉల్లిక్కిపడ్డారు!
భారీ పేలుడు సంభవించిన ప్రాంతం

కాకినాడలో ఉల్లిబాంబుల

పార్శిల్‌ దింపుతుండగా భారీ పేలుడు

ఐదుగురు హమాలీలకు గాయాలు.. ఒకరి పరిస్థితి విషమం

కాకినాడ క్రైం, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): కాకినాడలోని ఓ ట్రాన్స్‌పోర్ట్‌ కంపెనీలో సోమవారం ఉల్లిబాంబుల భారీ పేలుడు సంభవించి ఐదుగురు హమాలీలకు గాయాలయ్యాయి. ఈ ఘటనలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కాకినాడ జగన్నాథపురం కమర్షియల్‌ రోడ్డులోని వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరం ఉన్న జై బాలాజీ ట్రాన్స్‌పోర్ట్‌ కంపెనీకి హైదరాబాద్‌లో ఉన్న అదే ట్రాన్స్‌పోర్ట్‌ కంపెనీ నుంచి సోమవారం ఉదయం పార్శిల్‌ లారీ వచ్చింది. ఈ క్రమంలో అక్కడ ఉన్న హమాలీలు ఒక్కో పార్శిల్‌ను కిందకు దించుతున్నారు. గజ్జల మధు అనే హమాలీ లారీ నుంచి ఒక పార్శిల్‌ను దించుతూ కిందకు పడవేశాడు. దీంతో ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలుడు సంభవిం చింది. దీంతో అక్కడ విధుల్లో ఐదుగురు హమాలీలు చెల్లాచెదురుగా ఎగిరిపడి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను 108 వాహనంలో జీజీహెచ్‌కు తరలించగా చికిత్స పొందుతున్నారు. గాయపడిన వారి లో స్థానిక డైరీఫాం సెంటర్‌కు చెందిన 35ఏళ్ల గజ్జల మధు, అదే ప్రాంతానికి చెందిన 32ఏళ్ల మేడిశెట్టి లోవరాజు, కాకినాడ రూరల్‌ మండలం ఏపీఎస్పీ ప్రాంతానికి చెందిన 30ఏళ్ల బొందు అశోక్‌, ఇంద్రపాలెం గ్రామానికి చెందిన 39ఏళ్ల దారా నగేష్‌, అదే ప్రాంతానికి చెందిన 55ఏళ్ల బంధాల పోతురాజు ఉన్నారు. మధు పరిస్థితి విషమంగా ఉన్నట్టు జీజీహెచ్‌ అత్య వసర విభాగ వైద్యులు తెలిపారు.

ఘటన అనంతరం కాకినాడ జిల్లా ఎస్పీ జి.బింధుమాధవ్‌, కాకినాడ ఎస్‌డీపీవో, ఐపీఎస్‌ అధికారి మనీష్‌దేవరాజ్‌ పాఠిల్‌, ట్రైనీ ఏఎస్పీ సుస్మిత సంఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటన జరగడానికి ప్రధాన కారణం చిన్న పిల్లలు గోడకేసి కొట్టే ఉల్లిపాయ టపాసులని ఎస్పీ వెల్లడించారు. స్థానిక పెద్దమార్కెట్‌లో జనరల్‌ స్టోర్స్‌ నిర్వహిస్తున్న మాజేటి శ్రీనివాసరావు హైదరాబాద్‌ నుంచి జై బాలాజీ ట్రాన్స్‌పోర్ట్‌కు చెందిన లారీ లో ఒక్కో ప్లాస్టిక్‌ డబ్బాలో 60 ఉల్లిబాంబులు ఉండేలా ప్యాక్‌ చేశారు. ఒక్కో పార్శిల్‌లో 30 డబ్బాల చొప్పున 3 పార్సిల్‌లు దిగుమతి చేసుకున్నాడు. అందులో మొదటి పార్సిల్‌ దింపుతుండగా ఈ విస్ఫోటనం జరిగింది. దీంతో మరో పార్శిల్‌లో ఉన్న పెద్ద పెద్ద నట్లు, బోల్టులు చెల్లాచెదురుగా ఎగిరిపడి హమాలీలకు కాలిన గాయాలయ్యాయి. దీనిపై కాకినాడ వన్‌టౌన్‌ సీఐ ఎం.నాగదుర్గారావ్‌ కేసు నమోదు చేశారు.

Updated Date - Mar 04 , 2025 | 12:06 AM