జాతీయ స్థాయిలోనూ ప్రతిభ చాటాలి: కలెక్టర్
ABN , Publish Date - Jan 10 , 2025 | 12:55 AM
విజయవాడలో రాష్ట్రస్థాయిలో నిర్వహించిన విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో సత్తాచాటి జాతీయస్థాయి ప్రదర్శనలకు ఎంపికైన ప్రాజెక్టు రూపకర్తలను కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ గురువారం కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో ప్రత్యేకంగా అభినందించారు.
అమలాపురం టౌన్, జనవరి 9(ఆంధ్రజ్యోతి): విజయవాడలో రాష్ట్రస్థాయిలో నిర్వహించిన విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో సత్తాచాటి జాతీయస్థాయి ప్రదర్శనలకు ఎంపికైన ప్రాజెక్టు రూపకర్తలను కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ గురువారం కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో ప్రత్యేకంగా అభినందించారు. జాతీయ స్థాయిలో ప్రతిభచాటి కోనసీమ ఖ్యాతిని ఇనుమడింప చేయాలన్నారు. ఊబలంక జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి నికిల్కుమార్రెడ్డి, గైడ్ టీచర్ ఇ.నాగలక్ష్మి ఆధ్వర్యంలో రూపొందించిన రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ జాతీయస్థాయి ప్రదర్శనకు ఎంపికైంది. నీటి రక్షణకు వినూత్న విధానాలను ఈ ప్రాజెక్టు ద్వారా ప్రతిపాదించడంతో భవిష్యత్తు తరాలకు నీటిని అందించడం, నీటి పొదుపు విశిష్టతను వివరించిందని జిల్లా సైన్స్ అధికారి జీవీఎస్ సుబ్రహ్మణ్యం తెలిపారు. అమలాపురం మండలం వన్నెచింతలపూడి జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సోరపల్లి సత్యవర్థన, పరమట రోహిణి రూపొందించిన మల్టీపర్పస్ యుటిలైజేషన్ మిషన్ ప్రాజెక్టు జాతీయ స్థాయి ప్రదర్శనకు ఎంపికైంది. వనరులను సమగ్రంగా వినియోగించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు ఏవిధంగా దోహదపడుతుందో ప్రాజెక్టు ద్వారా వివరించారు. తొండవరం జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల గైడ్ టీచర్ కేసీహెచ్ఎల్జీ నరసింహారావు, వేస్ట్ టూ వెల్త్ ప్రాజెక్టును రూపొందించగా జాతీయస్థాయికి ఎంపికైంది. ఇక గోడి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థి కె.శాల్విన రూపొందించిన మేజికల్ అంబ్రెల్లా ప్రాజెక్టు జాతీయస్థాయికి ఎంపికైంది. ఆయా పాఠశాలల విద్యార్థులను, గైడ్ టీచర్లను జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ షేక్ సలీంబాషా సమక్షంలో కలెక్టర్ అభినందించారు. కార్యక్రమంలో సైన్స్ అధికారి సుబ్రహ్మణ్యం, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎగ్జామినేషన్ బీర హనుమంతరావు, ఏఎంవో రాంబాబు తదితరులు పాల్గొన్నారు.