ఎమ్మెల్సీ ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించాలి
ABN , Publish Date - Feb 14 , 2025 | 01:24 AM
ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల శాసనమండలి ఎన్నిక సజావుగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని ఎన్నికల సాధారణ పరిశీలకురాలు కె.సునీత, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు.

అమలాపురం, ఫిబ్రవరి 13(ఆంధ్రజ్యోతి): ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల శాసనమండలి ఎన్నిక సజావుగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని ఎన్నికల సాధారణ పరిశీలకురాలు కె.సునీత, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. ఏలూరు కలెక్టర్ కార్యాలయంనుంచి గురువారం ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశాలపై సూచనలు చేశారు. కలెక్టరేట్నుంచి ఎస్పీ బి.కృష్ణారావుతో కలిసి పాల్గొన్న కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ మాట్లాడుతూ జిల్లాలో 64,471మంది ఓటర్లు ఉన్నారన్నారు. 95 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్ సిబ్బందికి, సూక్ష్మ పరిశీలకులకు మొదటిదశ శిక్షణ ఈనెల 17న, రెండో దశ 20న నిర్వహించనున్నట్టు వెల్లడించారు. అమలాపురం డివిజన్కు ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, రామచంద్రపురం డివిజన్కు వీఎస్ఎం ఇంజనీరింగ్ కళాశాల, కొత్తపేట డివిజన్కు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు డిస్ర్టిబ్యూషన్ కేంద్రాలుగా ఏర్పాటు చేశామన్నారు. జిల్లావ్యాప్తంగా 210 బ్యాలెట్ బాక్సులతోపాటు 10శాతం రిజర్వుతో ఏర్పాటుచేశామన్నారు. బ్యాలెట్ పత్రాలను 5శాతం రిజర్వుడుతో కలిపి 67,725 పత్రాలను సిద్ధం చేశామన్నారు. డీఆర్వో రాజకుమారి, డీటీవో శ్రీనివాసరావు పాల్గొన్నారు.