Share News

మందపల్లిలో రెచ్చిపోతున్న మట్టిమాఫియా

ABN , Publish Date - Feb 08 , 2025 | 01:20 AM

కొత్తపేట మండలం మందపల్లి లంక భూముల్లో మట్టి మాఫియా రెచ్చిపోతోంది.

మందపల్లిలో రెచ్చిపోతున్న మట్టిమాఫియా

కొత్తపేట, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): కొత్తపేట మండలం మందపల్లి లంక భూముల్లో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. ప్రతిరోజూ వందలాది లారీలతో అడ్డు, అదుపు లేకుండా లంకలను గుల్ల చేస్తున్నారు. ఇంతలా మట్టి మాఫియా రెచ్చిపోతున్నా రెవెన్యూ, పోలీస్‌శాఖ అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ట్రిప్పుకు రూ.2వేలు కప్పం కడితే అన్నీ తామే చూసుకుంటామని వారు అంటున్నారని స్థానిక రైతులు పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కొత్తపేట, కపిలేశ్వరపురం మండలాలను ఆనుకుని ఉన్న లంక గ్రామాలైన మందపల్లి, కేదార్లంక, వీధివారిలంక, నారాయణలంక, వానపల్లి లంక గ్రామాలు రెండు మండలాలకు సరిహద్దు లంక గ్రామాలుగా ఉంది. దీంతో రెండు నియోజకవర్గాల అధికార పార్టీ నేతల మధ్య ఏర్పడిన సయోధ్యతో మట్టిమాఫియా రెచ్చిపోతోందన్న ఆరోపణలున్నాయి.

ఏటిగట్లు, నదీగర్భాలను వదల్లేదు

ఇంతకు ముందు లంక రైతులను ఒప్పించి కొంత సొమ్ము చెల్లించి వారి భూముల్లో మట్టిని తవ్వుకునేవారు. ఇటీవల అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏటిగట్లు చెంతన, నదీగర్భాలను సైతం వదలకుండా గుల్ల చేస్తున్నారని లంక రైతులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ భూముల్లో సైతం అక్రమ తవ్వకాలతో కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నా ఆయా శాఖల అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఇప్పటికైనా మట్టి అక్రమ తవ్వకాలను ఆపకపోతే నదీపాతంలోకి లంక గ్రామాలు కలిసిపోయే ప్రమాదం ఉందని పర్యావరణవేత్తలు, రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

చోద్యం చూస్తున్న అధికారులు

అధికార పార్టీ కనుసన్నల్లో జరుగుతున్న వ్యవహారం కాబట్టి అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదని స్థానిక రైతులు ఆరోపి స్తున్నారు. అధికార పార్టీ నేతల అండ చూసు కునే మట్టిమాఫియా రెచ్చిపోతోందని పలువురు రైతులు ఆరోపణలు గుప్తిస్తున్నారు.

Updated Date - Feb 08 , 2025 | 01:20 AM