శివారు భూములకు సాగునీటి ఎద్దడి తలెత్తకుండా క్రాస్ బండ్లు ఏర్పాటుకు ప్రతిపాదనలు
ABN , Publish Date - Feb 11 , 2025 | 12:33 AM
శివారు భూములకు సాగునీటి ఎద్దడి తలెత్తకుండా కాల్వలు, డ్రైన్లపై అవసరమైన చోట్ల క్రాస్బండ్లు ఏర్పాటుచేసే దిశగా ప్రతిపాదనలు సిద్ధంచేసి నివేదిక సమర్పించాలని కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
అమలాపురం, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): శివారు భూములకు సాగునీటి ఎద్దడి తలెత్తకుండా కాల్వలు, డ్రైన్లపై అవసరమైన చోట్ల క్రాస్బండ్లు ఏర్పాటుచేసే దిశగా ప్రతిపాదనలు సిద్ధంచేసి నివేదిక సమర్పించాలని కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి సోమవారం జిల్లాస్థాయి అధికారులతో కలిసి మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించి పలు అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రబీ సీజన్లో జిల్లాలోని శివారు భూములకు సైతం సాగునీరు సక్రమంగా అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. క్రాస్బండ్ల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనల నివేదికలను ఈ నెల 14లోపు అందించాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. గ్రీవెన్స్ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నందున ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను పరిష్కరించే అంశంపై నాలుగు పారామీటర్ల ఆధారంగా జిల్లాలకు ప్రతీనెల ర్యాంకులు ఇస్తున్నారన్నారు. ప్రజా ప్రతినిధులు, వీఐపీల నుంచి వచ్చే ఫిర్యాదులను సంబంధిత శాఖల జిల్లాస్థాయి అధికారులు ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించాలన్నారు. రెండు వారాలలోపు ప్రతీ ఒక్కశాఖ పనితీరు మెరుగు పరుచుకోవాలన్నారు. రెవెన్యూ సదస్సులో అందిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలన్నారు. జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా నిర్వహిస్తున్న 17 గ్రామాల్లో రీసర్వేను ఈ నెల 20వ తేదీలోపు పూర్తి చేయాలన్నారు. గతంలో సరిహద్దు రాళ్లపై ముద్రించిన చిత్రాలను చెరిపివేసే ప్రక్రియకు నిధులు కేటాయించినట్లు చెప్పారు. ఆక్వా, ఆక్వాయేతర జోన్లలో ఉన్న చెరువులను రెవెన్యూ, మత్స్యశాఖలు సంయుక్తంగా సర్వే నిర్వహించి ఈ నెల 20లోపు ఆక్వాజోన్ మ్యాప్లను తయారు చేయాలని ఆదేశించారు. జిల్లాలో ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత నియోజకవర్గ ప్రత్యేక అధికారి, ఐదుగురు సచివాలయ సిబ్బంది, ఒక ప్రత్యేక నిపుణుడితో కలిసి ప్రజా ప్రతినిధుల సలహాలు తీసుకుని విజన్-2047 ప్లాన్లోని పది సూత్రాలు ప్రతిబింబించే ప్రతీ నియోజకవర్గానికి రూపొందించాలన్నారు. ఎంఎస్ఎంఈ సర్వేను నెలాఖరులోపు పూర్తి చేయాలన్నారు. ఉచిత ఇసుక విధానంలో భాగంగా జిల్లాలో ఎవరైనా మనుషులతో ఇసుకను తవ్వి తీసుకుపోవచ్చని, ఇసుకను తరలించేటప్పుడు సంబంధిత సచివాలయంలో కూపన్లు రైజ్ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. అయినవిల్లిలో నూతనంగా నిర్మించనున్న విద్యుత్ ఉప కేంద్రానికి సంబంధించి రావులపాలెం, కొత్తపేట, అంబాజీపేట, అయినవిల్లి మండలాల్లో ఏర్పాటు చేయాల్సిన 64 విద్యుత్ టవర్లను నిర్మించడానికి రైతులను ఒప్పించే దిశగా సంబంధిత తహశీల్దార్లు కృషి చేయాలన్నారు. జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి, జిల్లా రెవెన్యూ అధికారి రాజకుమారి, ఆర్డీవోలు కె.మాధవి, పి.శ్రీకర్, డి.అఖిల, డీఆర్డీఏ పీడీ డాక్టర్ వి.శివశంకరప్రసాద్, జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.