ప్రతి రైతుకు విశిష్ట గుర్తింపు సంఖ్య
ABN , Publish Date - Feb 15 , 2025 | 12:42 AM
అన్నదాతలకు వ్యవసాయ సేవలను సులభతరం చేసి మరింత పారదర్శకంగా అందించేందుకు ప్రతి రైతుకూప్రత్యేక విశిష్ట గుర్తింపు సంఖ్య అందుబాటులోకి తీసుకురానున్నారు.

ఐ.పోలవరం, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): అన్నదాతలకు వ్యవసాయ సేవలను సులభతరం చేసి మరింత పారదర్శకంగా అందించేందుకు ప్రతి రైతుకూప్రత్యేక విశిష్ట గుర్తింపు సంఖ్య అందుబాటులోకి తీసుకురానున్నారు. రైతు సంక్షేమశాఖ, భారతప్రభుత్వం సమన్వయంతో రాష్ట్ర వ్యవసాయశాఖ చేపడుతున్న బృహత్తర కార్యక్రమం ఇది. దీని ద్వారా 11అంకెలతో రైతు గుర్తింపు సంఖ్యను ఏర్పాటు చేసి, తద్వారా ప్రభుత్వ సేవలను అందించడం జరుగుతుంది. రైతు భూవివరాలను రైతు రిజిస్ట్రీ పోర్టల్లో నమోదు చేసిన తర్వాత గుర్తింపు సంఖ్య కేటాయిస్తారు. ఈ సంఖ్య ఆధారంగానే వ్యవసాయ సంబంధిత సేవలు అందుతాయి. ప్రభుత్వం నుంచి అందే వివిధ రాయితీలు, బీమా వంటి ప్రయోజనాలు పొందవచ్చు. పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ,పంటలబీమా, పంటరుణాలపై వడ్డీరాయితీ, రాయితీపై యంత్రపరికరాలు, సూక్ష్మ పోషకాలు, పెట్టుబడి సాయం, పంట రుణాలు, ఈ -పంట నమోదు తదితర పథకాలు పొందవచ్చు. నీటి పారుదల, తెగుళ్ళ నియంత్రణ, వాతావరణ సూచనలు వంటి సేవలు పొందవచ్చు.
నమోదు విధానం ఇలా..
రైతు ఆధార్ నెంబర్..ఆధార్ అనుసంధానిత ఫోన్ నెంబరు, కొత్త పట్టాదార్ పాస్బుక్ తీసుకుని గ్రామంలోని రైతు కేంద్రాన్నిర సంప్రదించి గుర్తింపు సంఖ్య నమోదు చేయించుకోవాలి.