డంపింగ్ యార్డులో చెత్త వేయొద్దంటూ ధర్నా
ABN , Publish Date - Feb 23 , 2025 | 12:32 AM
అమలాపురం డంపింగ్ యార్డులో చెత్తను తగలబెట్టడం వల్ల విడుదలవుతున్న పొగతో ప్రజారోగ్యం దెబ్బతింటుందని, చెత్త వేయడాన్ని నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం ఉదయం డంపింగ్ యార్డు ముఖద్వారం వద్ద పరిసర ప్రాంతాల వార్డు ప్రజలు టెంట్ వేసి ధర్నా చేపట్టారు.
అమలాపురం టౌన్, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): అమలాపురం డంపింగ్ యార్డులో చెత్తను తగలబెట్టడం వల్ల విడుదలవుతున్న పొగతో ప్రజారోగ్యం దెబ్బతింటుందని, చెత్త వేయడాన్ని నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం ఉదయం డంపింగ్ యార్డు ముఖద్వారం వద్ద పరిసర ప్రాంతాల వార్డు ప్రజలు టెంట్ వేసి ధర్నా చేపట్టారు. పట్టణం నుంచి సేకరించిన చెత్తను తీసుకువస్తున్న ట్రాక్టర్లను లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో మున్సిపల్ కమిషనర్ కేవీఆర్ఆర్ రాజు, పట్టణ ఎస్ఐ కిశోర్బాబు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఆందోళన చేస్తున్న వారితో పలు దఫాలుగా చర్చించారు. ఎట్టి పరిస్థితుల్లోను చెత్తను వేయనిచ్చేది లేదని భీష్మించారు. నిరసన శిబిరంలో కౌన్సిలర్ చిత్రపు రామకృష్ణ, నాయకులు వంటెద్దు వెంకన్నాయుడు, కల్వకొలను బాబి, సుంకర సుధ, దొంగ చిన్నా తదితరులు పాల్గొన్నారు. ఆ సమయంలో మున్సిపల్ చైర్పర్సన్ రెడ్డి సత్యనాగేంద్రమణితో కలిసి పట్టణానికి చెందిన కౌన్సిలర్లంతా పార్టీ రహితంగా అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావును కలుసుకుని వినతిపత్రం అందజేశారు. అమలాపురం పట్టణ పరిసర గ్రామాల్లోని చెత్తను సేకరించి స్థానిక డంపింగ్ యార్డుకు తరలించడంలో ఎదురయ్యే ఇబ్బందులను కౌన్సిలర్లు తిక్కిరెడ్డి వెంకటేష్, యేడిద శ్రీను, మట్టపర్తి నాగేంద్ర, సంసాని బులినాని, గండి దేవిహారిక వివరించారు. భవిష్యత్తులో సమీపంలోని గ్రామాలు పట్టణంలో విలీనమయ్యే అవకాశం ఉందని, డంపింగ్ యార్డు కోసం స్థల సేకరణకు చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే ఆనందరావు వివరించారు. అయితే డంపింగ్ యార్డు వల్ల స్థానిక వార్డుల ప్రజలు పడుతున్న అవస్థలను ఎమ్మెల్యేకు వివరించారు. భూ సేకరణ జరిపే వరకు గ్రామాల నుంచి చెత్తను తీసుకువచ్చే ట్రాక్టర్లను నిలుపుదల చేయాలని కౌన్సిలర్లు గొవ్వాల రాజేష్, తిక్కా సత్యలక్ష్మి, దొమ్మేటి రాము తదితరులు కోరారు. భూసేకరణకు ఎమ్మెల్యే హామీ ఇవ్వడంతో డంపింగ్ యార్డు ఎదుట చేపట్టిన ధర్నాను స్థానికులు విరమించడంతో చెత్త ట్రాక్టర్లు లోనికి వెళ్లాయి.