నిర్వాసితులు పరిహారం తీసుకోవాలి
ABN , Publish Date - Feb 20 , 2025 | 12:29 AM
216 జాతీయ రహదారి విస్తరణలో భాగంగా బైపాస్ రోడ్డు నిర్మాణం వల్ల భూ సేకరణకు అవార్డు పాసై భూములు, ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులు త్వరితగతిన నష్టపరిహారం తీసుకోవాలని అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ సూచించారు.
మామిడికుదురు, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): 216 జాతీయ రహదారి విస్తరణలో భాగంగా బైపాస్ రోడ్డు నిర్మాణం వల్ల భూ సేకరణకు అవార్డు పాసై భూములు, ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులు త్వరితగతిన నష్టపరిహారం తీసుకోవాలని అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ సూచించారు. మండల పరిధిలోని మామిడికుదురు, పాశర్లపూడి గ్రామాల్లో నిలిచిపోయిన బైపాస్ రోడ్డు పనులను బుధవారం ఆయన పరిశీలించి నిర్వాసితులతో మాట్లాడారు. ప్రజాప్రయోజనాల దృష్ట్యా రోడ్డు నిర్మాణం ఆగదని, ఇప్పటికే అటూ ఇటూ రోడ్ల నిర్మాణాలు పూర్తి కావచ్చాయని, మామిడికుదురులో 300 మీటర్లు, పాశర్లపూడిలో 200 మీటర్లు నిర్వాసితుల అభ్యంతరాల వల్ల పనులు నిలిచిపోయినట్టు తెలిపారు. దీనిపై స్థానిక నిర్వాసితులు మాట్లాడుతూ తాము విలువైన భూములు కోల్పోతున్నామని, పరిహారాన్ని చదరపు గజాల్లో చెల్లించాలని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై ఆయన మాట్లాడుతూ ముందు నష్టపరిహారం తీసుకోవాలని, భూముల విలువ పెంపు కోసం తదుపరి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి తగు న్యాయం చేయడానికి కృషి చేస్తానన్నారు. రోడ్డు నిర్మాణంలో అడ్డంకిగా ఉన్న ఇళ్లు కోల్పోయినవారు రోడ్డు నిర్మాణం నిలుపుదల చేయాలనే నెపంతో ఇళ్లు విలువలను గణించడానికి సహకరించడం లేదని, ఆ విధంగా చేయడం సరికాదని ఆర్అండ్బీ అధికారుల ద్వారా ఇళ్లు కోల్పోయినవారు అంచనాల విలువలు గణించేందుకు సహకరించాలని సూచించారు. ప్రభుత్వ పరంగా నిర్వాసితులకు అన్నివిధాలా సహకారం అందిస్తామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. అనంతరం ఈదరాడ గ్రామంలో నిర్వహిస్తున్న రీసర్వే ప్రక్రియను క్షేత్రస్థాయిలో సందర్శించి భూ సర్వే ఆధారంగా రీసర్వే ప్రక్రియ నిర్వహిస్తున్నదీ లేనిదీ తెలుసుకున్నారు. రీసర్వేను ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం భవిష్యత్తులో ఎటువంటి వివాదాలకు తావు లేకుండా పారదర్శకంగా నిర్వహించి రెవెన్యూ రికార్డులను పూర్తిగా స్వచ్ఛీకరించి ఆన్లైన్లో పొందుపరచాలని ఆదేశాలిచ్చారు. కరవాక గ్రామంలో జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాల ప్రకారం పర్యావరణానికి విఘాతం కలిగించే విధంగా ఉన్న ఆక్వా చెరువులను ధ్వంసం చేస్తున్న తీరును పరిశీలించి ఎన్జీటీ ఆదేశాలను తప్పనిసరిగా అమలు చేస్తూ అనధికారికంగా అక్రమ చెరువులను త్వరితగతిన ధ్వంసం చేయాలని తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో కలెక్టర్తో అమలాపురం ఆర్డీవో కె.మాధవి, సర్వే అండ్ ల్యాండ్ రికార్డు సహాయ సంచాలకులు కె.ప్రభాకర్, తహశీల్దార్ సుబ్రహ్మణ్యాచార్యులు, డిప్యూటీ తహశీల్దార్ కె.శరణ్య, రెవెన్యూ, మత్స్యశాఖ సిబ్బంది పాల్గొన్నారు.