బడ్జెట్..రాష్ట్ర పునర్నిర్మాణానికి పునాది
ABN , Publish Date - Mar 02 , 2025 | 01:34 AM
అసెంబ్లీ లో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ రాష్ట్ర పునర్నిర్మాణానికి పునాదిలా ఉందని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. శనివారం అనపర్తిలోని కూటమి కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని వర్గాల ప్రజలను ఆదుకునే విధంగా బడ్జెట్లో కేటాయింపులు జరిగాయన్నారు.
ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి
అనపర్తి, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ లో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ రాష్ట్ర పునర్నిర్మాణానికి పునాదిలా ఉందని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. శనివారం అనపర్తిలోని కూటమి కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని వర్గాల ప్రజలను ఆదుకునే విధంగా బడ్జెట్లో కేటాయింపులు జరిగాయన్నారు. గత వైసీపీ పాలకుల విధ్వంసాల నుంచి వ్యవస్థలను పునరుద్ధరింపజేసే దిశగా బడ్జెట్ను రూపొందించారన్నారు. అన్ని వర్గాలకు నిధులు కేటాయించారని, అన్నదాత సుఖీభవ పథకానికి రూ.6300 కోట్లు కేటాయించడం ద్వారా రైతులకు మేలు చేకూరుతుందన్నారు. 48వేల కోట్లతో వ్యవసాయ బడ్జెట్ను రూపొందించి రైతులకు అండగా నిలిచిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మాత్రమేనన్నారు. సమావేశంలో సిరసపల్లి నాగేశ్వరరావు, తమలంపూడి సుధాకరరెడ్డి, వేణుగోపాలరెడ్డి, కొవ్వూరి వెంకటరామారెడ్డి, కర్రి బులిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
విద్యావ్యవస్థ మెరుగు: వాసు
రాజమహేంద్రవరం సిటీ, మార్చి 1( ఆంధ్రజ్యోతి): కూటమి సర్కార్ తీసుకునే కీలక నిర్ణయాలతో రాష్ట్రంలో విద్యావ్యవస్థ మెరుగు పడుతుందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఓ ప్రకటనలో అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యారంగానికి భారీగా నిధులు కేటాయించిందని, తల్లికి వందనం పథకానికి రూ.9,407 కోట్లు కేటాయించిందన్నారు. 1నుంచి 12 తరగతి వరకు ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో చదివే విద్యార్థులకు ఏటా రూ.,15 వేలు ఈ పథకం కింద ఆర్థిక సాయం అందించనుందని, ఒక ఇంట్లో ఎంత మంది విద్యార్థులున్నా అందరికి ఈ పథకం వర్తిస్తుందన్నారు. తల్లిదండ్రులను మోసం చేసిన వైసీపీ ఇప్పుడు ఈ పథకంపై తప్పుడు ప్రచారం చేస్తోందని ప్రజలు నమ్మవద్దని ఎమ్మెల్యే వాసు పేర్కొన్నారు.
నాయీబ్రాహ్మణులకు పెద్దపీట
రాష్ట్ర బడ్జెట్లో నాయీబ్రాహ్మణులకు పెద్దపీట వేసారని నాయీబ్రాహ్మణ నేత, టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి దాస్యం ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. రాజమండ్రి ప్రెస్క్లబ్లో శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాయీ బ్రాహ్మణులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కోసం బడ్జెట్లో రూ.450 కోట్లు కేటాయించడం కూటమి ప్రభుత్వానికి తమ సామాజిక వర్గంపై ఉన్న ప్రత్యేక శ్రద్ధను చాటుతుందన్నారు. వైసీపీ ప్రభుత్వం మరుగున పడేసిన ఆదరణ-2 పథకాన్ని కూట మి ప్రభుత్వం పునఃప్రారంభిస్తూ దానికి రూ.10 00 కోట్లు కేటాయించారన్నారు. తమకు ఎండో మెంట్ కమిటీల్లో అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుకు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో నాయీబ్రాహ్మణ సాధికార సమితి నగర అధ్యక్షుడు అలజంగి దేవుడు, కందికొండ అనంత్, పెండ్యాల నాగేశ్వరరావు, కోరుపల్లి నాగేశ్వనరావు, కోటిపల్లి చంద్రశేఖర్, వీవీవీ శ్రీనివాస్, కనకరాజు పాల్గొన్నారు.