వారం రోజుల్లో ఆక్వా చెరువుల సర్వే పూర్తిచేయాలి
ABN , Publish Date - Jan 28 , 2025 | 12:31 AM
సముద్ర తీర ప్రాంతంలోని ఆక్వాజోన్ ఆక్వాయేతర జోన్లలో ఎంత విస్తీర్ణంలో ఆక్వా చెరువులు ఉన్నవి వారం రోజుల్లో సర్వే చేసి గుర్తించాలని కలెక్టర్ మహేష్కుమార్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. జియో కోఆర్డినేట్స్ మ్యాప్లతో సహా బృందాలు సర్వే ఆధారంగా ఖచ్చితత్వంతో చెరువులను గుర్తించాలన్నారు.
అమలాపురం, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): సముద్ర తీర ప్రాంతంలోని ఆక్వాజోన్ ఆక్వాయేతర జోన్లలో ఎంత విస్తీర్ణంలో ఆక్వా చెరువులు ఉన్నవి వారం రోజుల్లో సర్వే చేసి గుర్తించాలని కలెక్టర్ మహేష్కుమార్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. జియో కోఆర్డినేట్స్ మ్యాప్లతో సహా బృందాలు సర్వే ఆధారంగా ఖచ్చితత్వంతో చెరువులను గుర్తించాలన్నారు. కలెక్టరేట్లో సోమవారం మత్స్యశాఖ అధికారులు, ఆర్డీవోలతో సమావేశం నిర్వహించి కోస్టల్ రీజియన్ జోన్, కోస్తా తీర ప్రాంత మేనేజ్మెంట్ హరిత ట్రిబ్యునల్, భూగర్భ జల శాఖ, కాలుష్య నియంత్రణ మండలి మార్గదర్శకాలు, కోస్టల్ ఆక్వా అథారిటీ ప్రకారం ఆక్వా చెరువుల అనుమతులపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటికే రెండు పర్యాయాలు సర్వే నిర్వహించినప్పటికీ ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా మరోసారి సర్వే నిర్వహించడానికి ప్రత్యేక బృందాలను నియమించామన్నారు. జీవో నంబరు 16 ప్రకారం వారం రోజుల్లో సర్వే పూర్తి చేస్తూ రోజువారీ సర్వే వివరాలను రాష్ట్రస్థాయి కమిటీకి సమర్పించాలన్నారు. అంతర్వేది ఉత్సవాలకు నియమించిన సిబ్బందికి ఆటంకం వాటిల్లకుండా మిగతా సిబ్బందిని సర్వే బృందాలుగా నియమించి ఆక్వా చెరువుల లెక్క తేల్చాలన్నారు. హరిత ట్రిబ్యునల్ అతిక్రమించినట్టు ప్రకటించిన చెరువుల్లో ఆక్వా సాగును పూర్తిగా రద్దు చేయాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి, ఆర్డీవోలు కె.మాధవి, పి.శ్రీకర్, దేవరకొండ అఖిల, జిల్లా మత్స్యశాఖ అధికారి ఎన్.శ్రీనివాసరావు, ఏడీ ఎల్బీఎస్ వర్థన్, ఎఫ్డీవో గోపాలకృష్ణ, అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ ప్రసాద్, మత్స్యశాఖ అభివృద్ధి అధికారులు పాల్గొన్నారు.