Digital Farming: ఖరీఫ్లో డిజిటల్ పంట సర్వే
ABN , Publish Date - Jun 30 , 2025 | 03:59 AM
ఈ ఏడాది ఖరీఫ్ సాగుకు సంబంధించి ఈ-పంట నమోదుకు డిజిటల్ పంట సర్వే మార్గదర్శకాలను వ్యవసాయశాఖ జారీ చేసింది. జూలై మొదటి వారంలో ఈ-పంట నమోదు ప్రారంభం కానుంది...
ఎన్ఐసీ సాంకేతిక సహకారంతో జూలై నుంచి నిర్వహణ
అమరావతి, జూన్ 29(ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది ఖరీఫ్ సాగుకు సంబంధించి ఈ-పంట నమోదుకు డిజిటల్ పంట సర్వే మార్గదర్శకాలను వ్యవసాయశాఖ జారీ చేసింది. జూలై మొదటి వారంలో ఈ-పంట నమోదు ప్రారంభం కానుంది. కచ్చితత్వం, పారదర్శకత కోసం జాతీయ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్(ఎన్ఐసీ) సాంకేతిక మద్దతుతో పూర్తి స్థాయిలో డిజిటల్ క్రాప్ సర్వే నిర్వహించనున్నారు. సాగుకు అనువు కాని భూములు, ప్రభుత్వ భూముల్ని పక్కన పెట్టేసి, కేవలం సాగు భూములను మాత్రమే ఎన్ఐసీ డిజిటల్ క్రాప్ సర్వేకు అనుసంధానం చేసిందని వ్యవసాయశాఖ డైరెక్టర్ డిల్లీరావు ఆదివారం తెలిపారు. భూ హక్కుల ఆధారంగా 100ు పంటల నమోదుతో డేటా సేకరించి, రైతుల ఈ-కేవైసీ పూర్తి చేసి, ఆధార్ అనుసంధాన మొబైల్ నంబర్ను అప్డేట్ చేయనున్నారు. అరటి, కొబ్బరి, మామిడి వంటి బహువార్షిక ఉద్యాన పంటలను జియో ఫెన్సింగ్తో ఫీల్డ్ సర్వే చేసి, ఫొటోలతో డేటా నమోదు చేయనున్నారు. పొలం గట్లపై ఉన్న చెట్లు, మొక్కలను కూడా పరిగణనలోకి తీసుకోనున్నారు. రాష్ట్రంలో ఖరీఫ్ పంటల అవసరాలకు యూరియా కొరత లేదని డిల్లీరావు తెలిపారు. ప్రస్తుతం 3.20 లక్షల టన్నుల యూరియా డీలర్లు, సొసైటీలు, రైతు సేవా కేంద్రాలు, మార్క్ఫెడ్ వద్ద నిల్వ ఉందన్నారు.