Pemmassani Chandrasekhar: వికసిత్ గ్రామాలతోనే వికసిత్ భారత్ సాధ్యం
ABN , Publish Date - Jul 15 , 2025 | 03:21 AM
వికసిత్ భారత్ను సాధించే క్రమంలో ముందుగా వికసిత్ గ్రామాలను నిర్మించాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పిలుపునిచ్చారు.
కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పిలుపు
న్యూఢిల్లీ, జూలై 14(ఆంధ్రజ్యోతి): వికసిత్ భారత్ను సాధించే క్రమంలో ముందుగా వికసిత్ గ్రామాలను నిర్మించాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. సోమవారం ఇక్కడ కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ పనితీరు సమీక్ష కమిటీ(పీఆర్సీ) మొదటి సమావేశంలో పెమ్మసాని మాట్లాడారు. ప్రతి కుటుంబానికీ పక్కా ఇల్లు, నాణ్యమైన రోడ్లతో కూడిన గ్రామాలు, గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం నిబద్ధతతో పనిచేయాలని అన్నారు. ఉపాధి హామీ పథకానికి ఏటా కేంద్రం రూ.90 వేల కోట్లకు పైగా కేటాయిస్తోందని దీంతో నాణ్యమైన, ఉత్పాదక ఆస్తుల సృష్టి జరుగుతుందని పెమ్మసాని వివరించారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన(గ్రామీణ్) కింద గ్రామీణ కుటుంబాల కోసం ఇప్పటివరకు 3.22 కోట్లకు పైగా పక్కా ఇళ్లు నిర్మించినట్లు తెలిపారు. 2029 నాటికి అదనంగా 2 కోట్ల ఇళ్లను నిర్మించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని తెలిపారు.